TELANGANA

తెలంగాణలో కొత్త పాలసీ..! వారికి మాత్రమే..!

కపటనాటక సూత్రధారి మళ్లీ ప్రజల్లోకి వస్తానని అంటున్నాడు. పదేళ్లు గాయాలు చేసి, ఇప్పుడు మళ్లీ అవే గాయాలు చేసే ప్రయత్నాలు మొదలు పెట్టాడు. రాష్ట్ర ప్రజలూ.. తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంతకు సీఎం ఇంతలా విమర్శించింది ఎవరినంటే మాజీ సీఎం కేసీఆర్ ను. మేడే సంధర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం మాట్లాడుతూ కార్మికులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందంటూ ఆరోపించారు.

 

రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన మేడే ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సంధర్భంగా కార్మిక శక్తిని సీఎం కొనియాడారు. సీఎం మాట్లాడుతూ.. కార్మికుల చెమట చుక్కలే ప్రపంచ అభివృద్ధికి బాటలు వేస్తున్నాయని తెలిపారు. ప్రపంచంలో ఎన్ని విప్లవాలు వచ్చినా కార్మికుల ఉద్యమం ప్రత్యేకమని కొనియాడారు.

 

తెలంగాణ సాధనలో సింగరేణి, ఆర్టీసీ, విద్యుత్ కార్మికులు, అసంఘటిత కార్మికుల పాత్ర మరువలేనిదని, రాష్ట్రంలో కార్మికులను ఆదుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళుతున్నట్లు సీఎం అన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందంటే అందుకు కార్మికుల సహకారం ఎంతో ఉందన్నారు.

 

కొత్త పాలసీ తీసుకువస్తున్నాం..

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే ఎన్నో అద్భుతాలను సృష్టించిందని సీఎం అన్నారు. సింగరేణి లాభాలలోకార్మికులకు వాటా ఇచ్చి బోనస్ ఇచ్చిన ఘనత ప్రజా ప్రభుత్వానిదని, గత పదేళ్ల నిర్లక్ష్యంతో విద్యుత్ వ్యవస్థ కుప్ప కూలే పరిస్థితి వచ్చిందన్నారు. ఒక పద్ధతి ప్రకారం నష్టాలను నివారిస్తూ ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపట్టామని, కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కార్మికులకు మేలు చేయడమే ప్రభుత్వ విధానమని, అసంఘటిత కార్మికుల కోసం గిగ్ వర్కర్స్ పాలసీని త్వరలో తీసుకురాబోతున్నట్లు సీఎం తెలిపారు.

 

అంతా అన్యాయమే

గత ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూపిందని, ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణచివేసి 50 మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్టీసీలో సమ్మెపై చర్చలు జరుగుతున్నాయంటున్నారని, ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా.. సమ్మె ఆలోచన వీడండి.. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ లాభాల బాటలో పయనిస్తోంది. ఇది మీ సంస్థ…. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్టీసీ కార్మికులపైనే ఉందన్నారు. గత పదేళ్లలో విధ్వంసం జరిగిందని, గత పాలకులు 50 వేల కోట్లు కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్ పెట్టారని తెలిపారు.

 

1 లక్షా 20 వేల కోట్లు ఇతర విభాగాల్లో పెండింగ్ పెట్టి వెళ్లారని, సర్పంచులకు బకాయిలు గత ప్రభుత్వం ఘనకార్యమే కదా అంటూ సీఎం ప్రశ్నించారు. మేం అధికారం చేపట్టే నాటికి ప్రతీ సంస్థలో 8 లక్షల 29 వేల కోట్లు మా చేతికి అప్పు పెట్టి వెళ్లారని, లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్ళకే కూలిందని ఆరోపించారు. రాష్ట్రంలో గత పదేళ్లు ఆర్ధిక దోపిడీ జరిగిందని, ఈ 15 నెలలు తాను, సహచర మంత్రులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు సీఎం తెలిపారు.

 

ప్లీజ్.. సమ్మె వద్దు

ఆర్టీసీ కార్మికులు పంతాలు, పట్టింపులకు పోకండి.. ఏదైనా సమస్య ఉంటే మంత్రిగారితో చర్చించండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్మిక సమ్మె అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఎం మాట్లాడుతూ.. వచ్చే ఆదాయమంతా మీ చేతిలో పెడతాం.. ఎలా ఖర్చు చేద్దామో మీరే సూచన చేయండి. అణా పైసా కూడా తాను ఇంటికి తీసుకెళ్లేది లేదని మరోమారు సీఎం పునరుద్ఘాటించారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేదని, అందుకే ఒకసారి ఆలోచించండి. కష్టమైనా, నిష్ఠూరమైన ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సమ్మె పోటు రాష్ట్రానికి నష్టం చేస్తుందని సీఎం అన్నారు. ఆర్టీసీ కార్మికులు మా కుటుంబ సభ్యులని, రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది.. మరో ఏడాదిలో కొంత కుదురుకుంటుందన్నారు.

 

పిల్లలకు కాస్త చెప్పండి కేసీఆర్..

పదేళ్లు ఏం చేయని వాళ్లు వచ్చి చెబితే వారి వలలో ఎవరూ పడొద్దని సీఎం అన్నారు. కెసిఆర్ చేసిన గాయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదని, అసెంబ్లీకి కేసీఆర్ పంపిన పిల్లలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారన్నారు. ఈ కామెంట్స్ కేటీఆర్ ను దృష్టిలో ఉంచుకొని సీఎం మాట్లాడారని చెప్పవచ్చు. దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు.. కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇవ్వండి అంటూ సీఎం కోరారు. కపటనాటక సూత్రధారి మళ్లీ బయలుదేరిండు.. ప్రజలు అప్రమత్తంగా ఉండండి అంటూ మాజీ సీఎం కెసిఆర్ లక్ష్యంగా సీఎం విమర్శించారు.