TELANGANA

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు… తీవ్రంగా స్పందించిన ఎమ్మెల్సీ కవిత..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ నోటీసులను ఆమె తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికే ఇటువంటి చర్యలకు పాల్పడుతోందని ఆమె ఆరోపించారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడుతున్న రాజకీయ క్రీడలో భాగంగానే కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు వచ్చాయని అర్థమవుతోందని అన్నారు. తమ పార్టీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వరుసగా నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని స్పష్టంగా తెలుస్తోందని ఆమె తన ‘ఎక్స్‌’ ఖాతాలో పేర్కొన్నారు.

 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, “ప్రభుత్వ వైఫల్యాల నుంచి, ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటీసులు ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో భాగంగానే ఏసీబీ నోటీసులు జారీ అయినట్లు స్పష్టమవుతోంది” అని తెలిపారు. ఎన్ని ఇబ్బందులు సృష్టించాలని ప్రయత్నించినా, వాటన్నింటినీ తట్టుకుని నిలబడే చరిత్ర కేసీఆర్ సైనికులకు ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.