TELANGANA

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విద్య.. తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లోనూ ఇకపై ప్రీ ప్రైమరీ విద్యను అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల నిర్వహణకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

 

ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు కల్పిస్తున్నారు. అయితే, ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం మూడేళ్ల వయసు నుంచే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వంటి ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్న వయసులోనే పునాది విద్య అందించాలనే ఉద్దేశంతో ప్రైవేటు కాన్వెంట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిణామం ప్రభుత్వ పాఠశాలల్లో ఏటా విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడానికి ఒక కారణంగా ప్రభుత్వం గుర్తించింది.

 

ఈ నేపథ్యంలో, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా శిశు విద్యను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం సంకల్పించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 210 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతుల్లో విద్యార్థులను చేర్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈవోలకు) స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.