TELANGANA

స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని.. డీకే అరుణ సంచలన వాఖ్యలు..!

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై బీజేపీ మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ధైర్యం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని ఆమె ఎద్దేవా చేశారు. రైతు సంక్షేమంపై గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రెండు ఎకరాల భూమి ఉన్న చిన్న రైతులకు కూడా రైతు భరోసా అందించడంలో విఫలమైందని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతు భరోసా పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ఇది కాంగ్రెస్ నేతలకే తెలియాలని ఆమె అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ పార్టీ భయపడుతోందని, అందుకే ఎన్నికల నిర్వహణలో జాప్యం చేస్తోందని ఆరోపించారు.

 

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీజేపీ నాయకులందరూ బాధితులేనని డీకే అరుణ తెలిపారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు కీలకమైన అంశాలపై సీబీఐ విచారణ కోరడంలో ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోందో చెప్పాలని ఆమె నిలదీశారు.

 

జూన్ 25వ తేదీ భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి రోజని ఎంపీ డీకే అరుణ అభివర్ణించారు. ఎమర్జెన్సీ పేరుతో కాంగ్రెస్ పార్టీ దేశంలో చేసిన అరాచకాలు, ప్రజలపై సాగించిన దౌర్జన్యాల గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. నాడు పేదలపై అకృత్యాలకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీ, నేడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ సామాజిక న్యాయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తన సొంత అజెండాను దేశంపై రుద్దేందుకే గతంలో రాజ్యాంగ సవరణలు చేసిందని ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడిచిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు.

 

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రపంచవ్యాప్తంగా లభిస్తున్న ఆదరణ, కీర్తి ప్రతిష్టలను చూసి రాహుల్ గాంధీ ఓర్వలేకపోతున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. “ఆపరేషన్ సిందూర్” ద్వారా భారతదేశ శక్తి సామర్థ్యాలను పాకిస్థాన్‌కు రుచి చూపించామని ఆమె గుర్తుచేశారు. ప్రధానమంత్రి మోదీని విమర్శించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముందుగా ఎమర్జెన్సీ కాలం నాటి కాంగ్రెస్ దురాగతాల గురించి మాట్లాడాలని ఆమె హితవు పలికారు.