TELANGANA

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఏసీబీ వల.. లంచం తీసుకుంటుండగా ఇద్దరి అరెస్ట్..!

ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అరికట్టేందుకు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. తాజాగా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడటం కలకలం రేపింది. కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన బిల్లుల మంజూరు కోసం వారు లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలున్నాయి.

 

ఆదిలాబాద్ పురపాలక సంఘ కార్యాలయంలో అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న బట్టల రాజ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కొండ్ర రవి కుమార్ ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.15,000 లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు గురువారం పట్టుకున్నారు. గత రెండు సంవత్సరాలుగా సదరు కాంట్రాక్టర్ పూర్తి చేసిన సీసీ రోడ్లు, డ్రైనేజీలు, హైమాస్ట్ లైటింగ్ పనులకు సంబంధించి సుమారు రూ.60,00,000 మొత్తం పెండింగ్‌లో ఉంది. ఈ మొత్తంలో భాగంగా రూ.3,80,000 విలువైన చెక్కును (పాక్షిక చెల్లింపు) మంజూరు చేసి, సంతకం చేసిన కాపీని అందజేసేందుకు గాను ఈ ఇద్దరు ఉద్యోగులు లంచం డిమాండ్ చేశారు.

 

బాధిత కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా ప్రణాళికతో వల పన్నారు. గురువారం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటున్న సమయంలో రాజ్ కుమార్, రవి కుమార్‌లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

 

ఈ సందర్భంగా, ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు నిర్భయంగా తమను సంప్రదించాలని అవినీతి నిరోధక శాఖ విజ్ఞప్తి చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1064ను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే, వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), అధికారిక వెబ్‌సైట్ (https://acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని ఏసీబీ అధికారులు భరోసా ఇచ్చారు.