TELANGANA

తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ఎవరు..?

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు ఎవరు? పార్టీ నేతల్లో ఇదే చర్చ జరుగుతోంది. బీజేపీ కొత్త చీఫ్ ఎవరేది ఆసక్తికరంగా మారింది. బలమైన రేవంత్ సర్కార్‌ని ఎదుర్కొని నిలబడడమేంటే ఆషామాషీ కాదు. పోటీపడుతున్న వారిలో ముగ్గురు ఎంపీలే కావడంతో త్రిముఖ పోటీ నెలకొంది.

 

బీజేపీ నిర్ణయాలు చాలామంది రాజకీయ నేతలకు అంతుబట్టవు. రాష్ట్రాల అధ్యక్షులు, ముఖ్యమంత్రి ఎంపికలో కొత్త వ్యక్తులు తెరపైకి వస్తారు. తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరనేది కేవలం 48 గంటల్లో తేలిపోనుంది. జులై ఒకటిన కొత్త అధ్యక్షుడ్ని ప్రకటించనుంది పార్టీ హైకమాండ్. అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఆదివారం వెలువడింది.

 

రేసులో ఉన్న ముగ్గురు నేతలు ఎంపీలే. ఒకరు ఈటెల రాజేందర్, మరొకరు అర్వింద్, ఇంకొకరు లక్ష్మణ్. గత ఎన్నికల్లో బీసీ నినాదంతో ఎన్నికలకు వెళ్లింది బీజేపీ. రాష్ట్ర పగ్గాలు బీసీ వ్యక్తికి కట్టబెట్టాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్‌ పేరు తెరపైకి వచ్చింది. అధ్యక్ష పదవిపై ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు ఢిల్లీ సమాచారం.

 

బీఆర్ఎస్ బలహీనపడడంతో బలమైన వ్యక్తిని తీసుకురావాలని ఆలోచన చేసింది బీజేపీ హైకమాండ్. రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. మిత్రులతో సఖ్యతగా ఉండే వ్యక్తి కోసం సెర్చింగ్ చేసింది. చివరకు లక్ష్మణ్ అయితే బెటరని అంచనాకు వచ్చిందట. హైకమాండ్ మాత్రం సౌమ్యుడికే పగ్గాలు అప్పగించాలని ఆలోచన చేస్తోంది.

 

పార్టీకి విధేయుడిగా ఎంపీ ధర్మపురి అరవింద్‌కు గుర్తింపు ఉంది. బీజేపీ అగ్రనేతలు ప్రధాని మోదీ, అమిత్ షాలకు సన్నిహితుడిగా ముద్ర వేసుకున్నారు. తెలంగాణలో బలమైన మున్నారు కాపు వర్గానికి చెందిన నేత. సూటిగా విమర్శలు చేయడంలో దిట్ట. మిగతా నేతల నుంచి వ్యతిరేకత లేకపోవడం, బలమైన రాజకీయ నేపథ్యం ఆయనకు కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు.

 

ఇక ఈటెల రాజేందర్ విషయానికి వద్దాం. బీసీ నేతగా గుర్తింపు ఉంది. ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర రాజకీయాలపై కాస్త పట్టు ఉంది. ప్రత్యర్థుల బలాబలాలపై కాస్తో కూస్తో అవగాహన లేకపోలేదు. రాజకీయ అనుభవం, తెలంగాణలో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ వర్గానికి చెందిన నేత. కాకపోతే వామపక్ష భావజాలం ఉన్న ఈటెలను ఆర్ఎస్ఎస్ అంగీకరిస్తుందా? అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్?

 

అలాగే ఎన్నికల వేళ మిత్రులతో ఆయన సఖ్యతగా ఉంటారా? అనేది మరో అంశం. ఈ ముగ్గురు నేతలకు జిల్లాల్లో ప్రత్యేకవర్గం అంటూ ఏమీ లేదు. అధ్యక్షుడి ఎంపికలో 119 మంది కౌన్సిల్ సభ్యులు 38 జిల్లాల అధ్యక్షులు, 17 మంది జాతీయ కమిటీ సభ్యులు కలిసి కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయనున్నారు.

 

ఈ లెక్కన పార్టీ హైకమాండ్ మాటే ఫైనల్ అన్నమాట. లేకుంటే పైన చెప్పిన ముగ్గురు వ్యక్తుల్లో ఒకర్ని అధ్యక్షులుగా నియమించి, మిగతా ఇద్దర్నీ ఉపాధ్యక్షులుగా నియమించినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నాయి కమలం వర్గాలు.