TELANGANA

ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్ కు సర్వే

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సంవత్సరం కూడా టైమ్ లేదు. దీంతో ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు వ్యూహాలు రచించే పనిలో పడ్డాయి. ఇక.. అధికార పార్టీ టీఆర్ఎస్ కూడా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. రెండు సార్లు గెలిచి సత్తా చాటిన సీఎం కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి కూడా గెలవాలన్న ఆశతో ఉన్నారు. మూడోసారి కూడా గెలిచి తెలంగాణలో చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోవాలని సీఎం కేసీఆర్ ఆశపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ప్రస్తుతానికి తెలంగాణలో బీజేపీ పార్టీనే టీఆర్ఎస్ పార్టీకి పోటీ అయింది. కాంగ్రెస్ పార్టీని తలదన్ని… బీజేపీ రెండో స్థానానికి ఎగబాకింది. మొదటి ప్లేస్ కోసం బీజేపీ తెగ ఆరాటపడుతున్న విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా బీజేపీ జెండా ఎగురవేయాలన్న లక్ష్యంతోనే కేంద్ర పెద్దలు కూడా ఢిల్లీలో కూర్చొని వ్యూహాలు రచిస్తున్నారు. మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ గెలిచినప్పటికీ సీఎం కేసీఆర్ అంతర్మధనంలో పడ్డారు. దానికి కారణం.. అక్కడ వచ్చిన మెజారిటీ కేవలం 10 వేలు మాత్రమే.మునుగోడులో పదివేల మెజారిటీతో సరిపెట్టుకున్న కేసీఆర్ అంటే..

తెలంగాణలో బీజేపీ బలపడుతోంది అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అందుకే.. ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ పెంచారు. ఎవరు తమ నియోజకవర్గాల్లో బలంగా ఉన్నారు.. ఎవరు బలహీనంగా ఉన్నారో కేసీఆర్ తెలుసుకుంటున్నారు. సర్వే రిపోర్ట్ తెప్పించుకున్నారు. సిట్టింగ్స్ అందరికీ టికెట్స్ అని ప్రకటించినప్పటికీ.. కొందరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్ కు సర్వే ద్వారా తెలిసింది. అందుకే.. ఎవరికి టికెట్స్ ఇవ్వాలి.. ఎవరికి టికెట్స్ ఇవ్వకూడదు అనేదానిపై సీఎం కేసీఆర్ మల్లగుల్లాలు పడుతున్నారు.