World

చైనాలో 80 శాతం జనాభాకు కరోనా

చైనాలో కరోనా వైరస్ విధ్వంసం కొనసాగుతోంది. దేశ జనాభాలో 80 శాతం మంది కరోనా (Corona) బారిన పడ్డారు. గత వారంలో అంటే జనవరి 13- 19 మధ్య కాలంలో దాదాపు 13,000 మంది రోగులు కోవిడ్‌తో (Covid) ఆసుపత్రులలో మరణించారని చైనా తెలిపింది. దీనితో పాటు రాబోయే రోజుల్లో కరోనా వైరస్ మరింత వినాశనం సృష్టించే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీరో కోవిడ్ విధానం ముగిసిన తర్వాత కరోనా విజృంభించడంలో అక్కడ మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్ 18 నుంచి జనవరి 12 వరకు చైనాలోని ఆసుపత్రులలో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ (Covid Infections) కారణంగా సుమారు 60 వేల మంది మరణించారు. ఈవిషయాన్ని కూడా చైనా ప్రభుత్వమే వారం క్రితం వెల్లడించింది. కరోనా ఇన్ఫెక్షన్ కారణంగా చైనా వ్యాప్తంగా ఆస్పత్రుల్లో చేరిన 681 మంది రోగులు మరణించారని ఆ దేశానికి చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) (Center For Disease Control and Prevention) ఒక ప్రకటనలో తెలిపింది.

ఈ రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ చనిపోయారని పేర్కొంది. గత ఏడు రోజుల్లో 11,977 మంది రోగులు చైనాలో ఈవిధంగా మరణించారు. ఇక కరోనాతో బాధపడుతూ ఇళ్లలో చనిపోయిన వారిని ఈ మరణాల జాబితాలో చేర్చలేదని అంటున్నారు. చైనా లూనార్ న్యూ ఇయర్ సెలవులు ఇప్పుడు కొనసాగుతున్నాయి. దీనికోసం చైనా ప్రజలు పెద్దఎత్తున ప్రయాణాలు చేస్తున్నారు. దీనివల్ల కూడా చైనాలో కొవిడ్ ఉధృతి పెరిగింది. ఇప్పటికే రోజూ వేలాది మంది కరోనాతో చనిపోతున్నారని.. ఆ సంఖ్య రోజూ 36 వేల దాకా పెరిగే ముప్పు ఉందని హెచ్చరిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా చైనా ఆర్థిక వృద్ధి రేటు 2022 సంవత్సరంలో 3 శాతానికి చేరింది. ఈ స్థితిని గట్టెక్కేందుకు 2022 డిసెంబర్ లో కరోనా ఆంక్షలను చైనా ఎత్తివేసింది. అయితే ఈ నిర్ణయం వల్ల డ్రాగన్ అన్ని నెగెటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి.