దేశంలో ప్లాస్టిక్ లేదా పాలిమర్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. రూ. 10, రూ. 20 విలువ కలిగిన ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించేందుకు భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.
ఈ ప్రయోగాల్లో భాగంగా రూ. 10, రూ. 20 డినామినేషన్లలో వంద కోట్ల చొప్పున పాలిమర్ నోట్లను ఆర్బీఐ జారీ చేయనుంది. భారతీయ వాతావరణ పరిస్థితుల్లో ఈ నోట్ల మన్నిక, పనితీరును పరిశీలించడమే ఈ క్షేత్రస్థాయి పరీక్షల ప్రధాన ఉద్దేశం. ఈ ప్రయోగాలు విజయవంతమైతేనే, వీటిని దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంపై తుది నిర్ణయం తీసుకుంటారు.
అయితే, ప్లాస్టిక్ పాలిమర్ నోట్లను ప్రవేశపెడుతున్నంత మాత్రాన ప్రస్తుతం చలామణిలో ఉన్న కాగితపు నోట్లను రద్దు చేసే ప్రతిపాదన ఏదీ లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగితపు నోట్లతో పాటే పాలిమర్ నోట్లు కూడా సమాంతరంగా చెలామణిలో ఉంటాయని మంత్రి వివరించారు.
సాధారణ కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయని, ఇవి సులభంగా పాడవవని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా తక్కువ విలువ కలిగిన నోట్లు త్వరగా చిరిగిపోతుండటంతో, వాటిని తరచూ మార్చాల్సి వస్తోంది. పాలిమర్ నోట్ల వినియోగం వల్ల ముద్రణ మరియు నిర్వహణ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

