AP

వైఎస్‌ఆర్‌సీపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యం.. చంద్రబాబుతో పవన్ భేటీ..

ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో కీలక పరిణామం జరిగింది. రాజమండ్రి జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన టీడీపీ అధినేత చంద్రబాబును శనివారం జనసేనాని పవన్‌ కల్యాణ్‌ కలిశారు. జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు ఇంట్లో మూడు గంటలకు పైగా ఈ భేటీ జరిగింది. ఇప్పటికే కలిసి ఎన్నికలకు వెళ్లాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఈ నిర్ణయం వెలువడిన తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు భేటీ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రధానంగా చర్చించారు. త్వరలోనే ఉమ్మడిగా పది అంశాలతో మేనిఫెస్టో విడుదల చేసే అంశంపై చర్చించారు. త్వరలో జనసేన టీడీపీ ఉమ్మడి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రెండు పార్టీల మధ్య మరింత ఎక్కువగా సమన్వయం ఉండేలా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.

 

ఇప్పటికే రెండు పార్టీల నుంచి ఉమ్మడి క‌మిటీల నియామ‌కం జ‌రిగింది. వైఎస్‌ఆర్‌సీపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకెళ్తామ‌ని రెండు పార్టీలు ప్రక‌టించాయి. అయితే ఉమ్మడి కార్యాచ‌ర‌ణ ఎలా ఉండాలి..? ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాల‌నే దానిపై చ‌ర్చించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి విస్తృత స్థాయి స‌మావేశం నిర్వహించాల‌ని నిర్ణయించాయి. న‌వంబ‌ర్ ఒక‌టో తేదీన విడుద‌ల చేయాల‌నుకున్న ఉమ్మడి మేనిఫెస్టో, న‌వంబ‌ర్ మూడో తేదీన నిర్వహించాల‌నుకున్న ఉమ్మడి విస్తృత స్థాయి స‌మావేశం కూడా వాయిదా ప‌డ్డాయి. అయితే చంద్రబాబు జైలు నుంచి బ‌య‌ట‌కు రావ‌డం, వైద్య ప‌రీక్షల కోసం హైద‌రాబాద్‌కు రావడం.. మ‌రోవైపు ఇట‌లీ నుంచి తిరిగొచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లో చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయ‌న‌తో భేటీ అయ్యారు.

 

దీపావళి తర్వాత జనంలోకి వెళ్లాలని నిర్ణయించాయి టీడీపీ, జనసేన. రెండు పార్టీలు ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇసుక, మద్యంపై ఆందోళన చెయ్యాలని, వచ్చే వారంలో కరువుపై నిరసన కార్యక్రమం చేపట్టాలని డిసైడ్ అయ్యాయి. గోదావరి జిల్లాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు.

 

రెండు పార్టీల కార్యకర్తలు.. దిగువ స్థాయి క్యాడర్ లో ఇబ్బందులు లేకుండా సమావేశాలు, ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. సోమవారం తర్వాత అమరావతికి వెళ్లనున్నారు పవన్. నేతలతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించనున్నారు.