AP

కుట్రలు, కుతంత్రాలు ఓడాయి: నారా లోకేశ్..

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ రావడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్వాగతించారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. సత్యం గెలిచిందని, అసంత్యంపై యుద్ధం మొదలైందని, చంద్రబాబు కడిగిన ముత్యమని, నీతి, నిజాయితీ, వ్యక్తిత్వం తలెత్తుకొని నిలబడ్డాయన్నారు. తప్పు చేయను చేయనివ్వను అని చెప్పే చంద్రబాబు మాటలు నిజమయ్యాయని లోకేష్ అన్నారు. 50 రోజులు గడిచినప్పటికీ కోర్టులో ఒక్క ఆధారాన్ని కూడా నిరూపించలేక కోర్టు ముందు కుట్రలు, కుతంత్రాలు ఓడిపోయాయన్నారు. షెల్ కంపెనీలు లేవని తేలిపోయిందన్నారు. చంద్రబాబు రాజకీయ జీవితంపై మచ్చ వేసేందుకు కుట్ర చేశారని వెల్లడైందన్నారు.

 

Advertisement

ఇకనైనా ముఖ్యమంత్రి జగన్ బుద్ధి తెచ్చుకొని కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. చంద్రబాబు త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వస్తారన్నారు. ఈనెల 29 నుంచి చంద్రబాబు పులిలా ప్రజల్లోకి వస్తారని, బెయిల్ వచ్చిందన్న ఆనందం కంటే 50 రోజులకు పైగా అన్యాయంగా ఆయన్ను జైల్లో నిర్బంధించారనే బాధే ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు బెయిల్ రావడంతో మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా పేల్చి నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచుకున్నారు.

 

 

అవినీతి ఆరోపణల్లో ఆధారాలు లేకే పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూసే ప్రయత్నం చేసి దెబ్బతిన్నారని టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై అవినీతి బురద చల్లడం వైసీపీ తరం కాదన్నారు. మిగిలిన కేసుల్లోను బెయిల్ వస్తుందని, పూర్తిస్థాయి కార్యక్రమాలు ఈనెల 29 నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసం వద్ద కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.