AP

ఈ 9 జిల్లాలతో టీడీపీ తొలి జాబితా..

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన నేపథ్యంలో- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. జనంలోకి వెళ్తోన్నారు. సిద్ధం పేరుతో ఏర్పాటు చేస్తోన్న భారీ బహిరంగ సభలతో ఎన్నికల యుద్ధానికి సన్నద్ధమౌతోన్నారు.

 

విశాఖపట్నం జిల్లా భీమిలీలో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించారు. లక్షలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మధ్య ఎన్నికల రణభేరిని మోగించారు. క్యాడర్‌లో ఎన్నికల ఊపును తీసుకొచ్చారు. జోష్‌ను నింపారు. ఎన్నికల కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూసేలా చేసింది.

 

దీనికి పోటీగా తెలుగుదేశం పార్టీ కూడా రాష్ట్రవ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టింది. రా.. కదలిరా పేరుతో ఆ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలను నిర్వహిస్తూ వస్తోన్నారు. తిరువూరు, గుడివాడ, మండపేట, అరకు, ఉరవకొండ, పీలేరు, పత్తికొండ, నెల్లూరు.. వంటి చోట్ల బహిరంగ సభలు ముగిశాయి.

 

అదే సమయంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను కూడా తెలుగుదేశం పార్టీ పూర్తి చేసింది. ఫిబ్రవరి 4వ తేదీన దీన్ని విడుదల చేయనుంది. 35 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి పుట్టపర్తి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల అభ్యర్థులను తొలి విడతలో ప్రకటిస్తారని తెలుస్తోంది.

 

ఎన్నికల గడువు సమీపిస్తోన్నందువల్ల అభ్యర్థుల జాబితాను వెల్లడించడంలో ఎలాంటి జాప్యం చేయకూడదని భావిస్తోంది టీడీపీ అగ్ర నాయకత్వం. బీజేపీతో పొత్తు అంశం తేలనప్పటికీ.. మిత్రపక్షం జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారం ఓ కొలిక్కి రానప్పటికీ.. వివాదం లేని, తాము ఖచ్చితంగా పోటీ చేయాలని భావించిన స్థానాల జాబితాను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చింది.

 

టీడీపీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మకాయల చినరాజప్ప, నందమూరి బాలకృష్ణ, పయ్యావుల కేశవ్, పరిటాల సునీత / పరిటాల శ్రీరామ్, ఆనం రామనారాయణ రెడ్డి, నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి.. వంటి నేతల పేర్లు తొలి జాబితాలో ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.

 

ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన నేపథ్యంలో జాబితా రూపకల్పనలో అన్ని జాగ్రత్తలను తీసుకుంది తెలుగుదేశం పార్టీ. అభ్యర్థుల ఎంపికలో ఇంటారిక్టివ్ వాయిస్ రెస్పాన్స్ విధానాన్ని అనుసరించింది. నేరుగా ఓటర్ల నుంచే అభిప్రాయాలను సేకరించింది. వాటన్నింటినీ క్రోడీకరించిన తరువాతే తొలి జాబితాకు తుది రూపాన్ని ఇచ్చింది.