AP

బుచ్చయ్య, గంటా సీట్ల పై చంద్రబాబు క్లారిటీ – అసంతృప్తులకు ఏం చెప్పారు..!

టీడీపీలో సీట్లు దక్కని అసంతృప్తులతో చంద్రబాబు మంతనాలు ప్రారంభించారు. సీనియర్లను తన నివాసానికి పిలిపించి మాట్లాడారు. పార్టీపరంగా ఉన్న పరిస్థితిని వివరించారు. వారికి ఇతరత్రా అవకాశాలు కల్పిస్తామని, పార్టీకి సహకరించాలని కోరారు. గోరంట్ల బుచ్చయ్యచౌదరి రాజమహేంద్రవరం రూరల్‌ స్థానం నుంచే ఎన్నికల బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. కందుల దుర్గేష్ ను నిడుదవోలు నుంచి పోటీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

గోరంట్ల సీటు సేఫ్: టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి సీటు పైన క్లారిటీ వచ్చింది. ప్రస్తుత స్థానం నుంచి బుచ్చయ్య పోటీ చేయనున్నారు. ఈ మేరకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి హామీ లభించింది. టీడీపీ తొలి జాబితాలో ఆయన పేరు లేకపోవటంతో చర్చకు కారణమైంది. అదే సీటును జనసేన నేత కందుల దుర్గేశ్‌ కూడా ఆశిస్తుండడంతో కొంత ఉత్కంఠకు దారితీసింది.

 

ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారమిక్కడ తన నివాసం నుంచి బుచ్చయ్యతో ఫోన్లో మాట్లాడారు. ఆయనకు ఖాయంగా అవకాశం లభిస్తుందని, ఆందోళన చెందవద్దని సముదాయించారు. అటు కందుల దుర్గేశం ను నిడుదవోలు నుంచి పోటీ చేయాలని పవన్ సూచించారు. దీని పైన దుర్గేశ్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

 

సీనియర్లకు బుజ్జగింపులు: సీట్లు దక్కని సీనియర్లను చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ (తెనాలి), దేవినేని ఉమామహేశ్వరరావు (మైలవరం), గంటా శ్రీనివాసరావు (విశాఖ ఉత్తరం), మాజీ ఎమ్మెల్యేలు గండి బాబ్జీ (విశాఖ దక్షిణ), పీలా గోవింద్‌ (అనకాపల్లి), రాజానగరం ఇన్‌చార్జి బొడ్డు వెంకటరమణ, రైల్వే కోడూరు పార్టీ నేత ముక్కా రూపానందరెడ్డి చంద్రబాబును కలిసారు.

 

గంటాతో భేటీలో చీపురుపల్లి స్థానంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అక్కడ మంత్రి బొత్స సత్యనారాయణపై గంటా పోటీ చేస్తే విజయావకాశాలు బాగుంటాయని సర్వే నివేదికలు వస్తున్నాయని, అక్కడ బరిలో దిగాలని చంద్రబాబు సూచించారు. అయితే తనకు భీమిలిపై ఆసక్తి ఉందని, అది కాకపోయినా విశాఖ జిల్లాలో ఎక్కడ అవకాశమిచ్చినా పోటీ చేస్తానని గంటా చెప్పారు.

 

చంద్రబాబు హామీ: ఎక్కడ నిలపాలో తాను నిర్ణయం తీసుకుంటానని, అది తనకు వదిలిపెట్టాలని చంద్రబాబు తనకు చెప్పారని గంటా వెల్లడించారు. మైలవరం సీటుపై దేవినేని ఉమ ముప్పావు గంట అధినేతతో చర్చించారు. అక్కడి సిటింగ్‌ వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ టీడీపీలోకి వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. జనసేనతో పొత్తు వల్ల తెనాలి సీటు ఇవ్వలేకపోతున్నామని మాజీ మంత్రి ఆలపాటికి చంద్రబాబు చెప్పారు.

 

మరెక్కడైనా సర్దుబాటు చేసే వీలుంటే ప్రయత్నం చేస్తానని.. కుదరకపోతే ఆ తర్వాతైనా ఏదో ఒక అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ను తీసుకుని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఆయన్ను కలిసి వచ్చిన తర్వాత కూడా గోవింద్‌ అసంతృప్తిగానే కనిపించారు. రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం పొత్తులో బీజేపీకి వెళ్లకపోతే దానికి బొడ్డు వెంకటరమణ పేరు పరిశీలిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.