CINEMA

తొలిసారి పోస్ట్ పెట్టిన పవన్ కల్యాణ్.. జ్ఞాపకాలతో వీడియో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవలే ఇన్‍స్టాగ్రామ్‍లో అడుగుపెట్టారు. జూలై 4వ తేదీ ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేశారు. అకౌంట్ క్రియేట్ అయిన గంటల్లోనే మిలియిన్ ఫాలోవర్లు వచ్చారు.

ఒక్క పోస్ట్ పెట్టకుండానే పవన్ ఇన్‍స్టా అకౌంట్‍కు ఇప్పటి వరకు 2.4 మిలియన్ ఫాలోవర్లు అయ్యారు. అయితే పవన్ కల్యాణ్ ఎప్పడెప్పుడు ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ పెడతారా అని అందరూ ఎదురు చూశారు. ఇప్పుడు అది నెరవేరింది. నేటి (జూలై 15) సాయంత్రం ఆయన ఇన్‍స్టాగ్రామ్‍లో తొలి పోస్ట్ పెట్టారు. సినీ పరిశ్రమలోని వారితో గతంలో తాను దిగిన ఫొటోలను ఓ అందమైన వీడియోగా పవన్ పోస్ట్ చేశారు. పవన్ స్టార్ అపూర్వమైన జ్ఞాపకాలు ఈ వీడియోలో ఉన్నాయి. వివరాలివే..

“ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. మన బంధం ఇలానే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ” అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు పవన్ కల్యాణ్. చిత్ర పరిశ్రమలో తనతో కలిసి పని చేసిన వారితో దిగిన ఫొటోలను ఈ వీడియో పవన్ పొందుపరిచారు. “చలన చిత్ర పరిశ్రమలో భాగమై ఎంతో మంది ప్రతిభావంతులతో, నిరాడంబరమైన వ్యక్తులతో కలిసి ప్రయాణిస్తున్నందుకు కృతజ్ఞుణ్ణి” అంటూ పవన్ పోస్ట్ చేసిన ఈ వీడియో మొదలైంది.

తన అన్న మెగాస్టార్ చిరంజీవికే ఈ వీడియోలో తొలి ప్రాధాన్యత ఇచ్చారు పవన్ కల్యాణ్. ఓ సందర్భంలో తనను చిరూ ముద్దాడిన ఫొటోలను ప్రారంభంలో ఉంచారు. ఆ తర్వాత బాలకృష్ణ, అమితాబ్ బచ్చన్, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, రామ్‍చరణ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఇలా చాలా మందితో తాను కలిసి దిగిన ఫొటోలను ఈ వీడియోలో పవన్ కల్యాణ్ పొందుపరిచారు. అలాగే, మరికొందరు ప్రముఖ నటులు, పలువురు దర్శకులు, నిర్మాతలు, టెక్నిషియన్స్ సహా మరికొందరితో పవన్ కల్యాణ్ ఉన్న ఫొటోలు ఈ వీడియోలో ఉన్నాయి. మొత్తంగా తన సినీ కెరీర్లోని అపూర్వమైన జ్ఞాపకాలను ఈ వీడియోతో పవన్ కల్యాణ్ వెల్లడించారు. “మన బంధం ఇలాగే కొనసాగాలని, మరెన్నో మధురమైన జ్ఞాపకాలను పంచుకోవాలని ఆశిస్తూ” అంటూ ఈ వీడియో ముగిసింది.