NationalWorld

భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్త ఫారిన్ పాలసీ..

రష్యా తన మిత్రదేశాలు, దానికి సంబంధించిన విదేశాంగ విధానంపై ఇటీవల ప్రకటన జారీ చేసింది, తన మిత్ర దేశాలైన చైనా, భారత్ తో మరింతగా సంబంధాలు మెరుగుపురుచుకునేందుకు రష్యా కొత్తగా ఫారిన్ పాలసీని ప్రవేశపెట్టింది. ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో తన మిత్రదేశాల ఏవో, శతృదేశాలేవనే దాని గురించి చెప్పకనే చెప్పింది. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలు రష్యాను శతృవుగా చూస్తుండటంతో కొత్త విదేశాంగ విధానం ద్వారా రష్యా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

 

ఇదిలా ఉంటే రష్యా కొత్త ఫారిన్ పాలసీకి చైనా మద్దతు ప్రకటించింది. భారత్, రష్యాతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చైనా వెల్లడించింది. బీజింగ్, మాస్కో, న్యూఢిల్లీ ప్రధాన శక్తులుగా అభివృద్ధి చెందుతున్నాయని, సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రపంచ మార్పుకు సంకేతం అని చైనా వెల్లడించింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పరస్పర గౌరవం, శాంతియుత సహజీవనం, ప్రధాన దేశాల మధ్య సంబంధాలు పెంపొందించడానికి చైనా, రష్యా అంకితభావంతో ఉన్నాయన్నారు.

 

ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి భారత్, చైనాలు రష్యాకు అండగా నిలుస్తున్నాయి. అమెరికాతో పాటు వెస్ట్రన్ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్, రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూనే ఉంది. పాశ్చాత్య దేశాల నుంచి ఒత్తిడి వచ్చినా ఇండియా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో రష్యా, భారత్ కు చాలా ప్రాధాన్యం ఇస్తోంది.