National

ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌

తిరుపతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రాజెక్ట్- మిషన్ చంద్రయాన్ 3. చంద్రుడిపై మరిన్ని పరిశోధనలను సాగించడానికి చేపట్టిన ప్రాజెక్ట్ ఇది.

2019లో ప్రయోగించిన చంద్రయాన్-2 విఫలమైన అనంతరం దీనికి శ్రీకారం చుట్టింది ఇస్రో. చంద్రయాన్ 2 చేదు అనుభవాలను మిగిల్చిన నేపథ్యంలో అవి పునరావృతం కాకుండా అన్ని జాగ్రత్తలను తీసుకుంటోంది.

ఈ నెల 14వ తేదీన చంద్రయాన్ స్పేస్ క్రాఫ్ట్‌ను ప్రయోగించనుంది ఇస్రో. మధ్యాహ్నం 2:35 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్తుందీ రాకెట్. దీనికి సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే చంద్రాయన్‌ స్పేస్ క్రాఫ్ట్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్‌కు చేరుకుంది. దీన్ని జియోసింక్రనస్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్‌ మార్క్-3తో అనుసంధానించింది.

ఈ స్పేస్ క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి మోసుకెళ్లేది ఈ రాకెట్టే. ప్రయోగించిన తేదీ నుంచి 40 రోజుల పాటు అంతరిక్ష ప్రయాణాన్ని కొనసాగిస్తుంది ఈ రాకెట్. ఆగస్టు 23 లేదా 24వ తేదీన చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయ్యేలా ఇస్రో ప్రణాళికలను వేసుకుంది. రోవర్‌ను చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ చేయాలనేదే ఇస్రో ప్రయత్నం.

ఈ ప్రయోగం నేపథ్యంలో- కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. శ్రీహరికోటలో రోడ్లు వేయడం, గుంతలు తవ్వడాన్ని నిషేధించింది. ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లు ధ్వంసం కాకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకుంది. గుంతలు తవ్వడం, నిర్మాణ పనులను కొనసాగించడం, రోడ్లను వేయడం వల్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తోంది.

షార్ సెంటర్‌కు అనుసంధానించే అన్ని ప్రధాన ఆప్టికల్ ఫైబర్ కేబుళ్ల వ్యవస్థను కేంద్ర టెలికం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోంది. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తమిళనాడు డివిజన్ పరిధిలో ఉంటుంది షార్ సెంటర్. చెన్నై-పెరంబూర్-గుమ్మిడిపూండిని అనుసంధానించే జాతీయ రహదారి- 5, చెన్నై-తిరువళ్లూర్ ఎన్‌హెచ్ 205, పెరంబూర్-పొన్నేరి స్టేట్ హైవే 56, తిరువళ్లార్- ఉత్తుకోట స్టేట్ హైవే 50 పొడవునా ఈ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేసింది.

అవన్నీ కూడా షార్ సెంటర్‌తో అనుసంధానించి ఉంటాయి. గుంతలు తవ్వడం, రోడ్లు వేయడం, ఇతర నిర్మాణ పనుల వల్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ నెట్ వర్క్ దెబ్బతింటే- అది చంద్రాయన్ 3 ప్రయోగంపై ప్రభావం చూపుతుందని అధికారులు భావిస్తోన్నారు. ప్రయోగ వ్యవస్థ మొత్తం నెట్‌వర్క్ మీదే ఆధారపడి ఉన్న నేపథ్యంలో దానికి ఎలాంటి విఘాతం కలగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు.