APNational

జగన్ ‘ముందస్తు’ వ్యూహం

వైసిపి ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తోంది. పార్టీ శ్రేణులకు స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. అన్ని జిల్లాలకు నూతన కార్యవర్గాలను నియమించింది.

జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు కార్యదర్శుల నియామకం పూర్తయింది. 26 జిల్లాల్లో పార్టీ బాధ్యతలను కీలక నేతలకు అప్పగించారు. ఎంపీలు,ఎమ్మెల్యేలతో పాటు పలువురు మాజీ మంత్రులకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టారు. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో నూతన కార్యవర్గాలను ప్రకటించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది.

అల్లూరి సీతారామరాజు జిల్లా అధ్యక్షురాలిగా ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నియమితులయ్యారు. అనకాపల్లి జిల్లాకు బొడ్డేట ప్రసాద్, అనంతపురం జిల్లాకు పైల నరసింహయ్య, అన్నమయ్య జిల్లాకు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, బాపట్ల కు ఎంపీ మోపిదేవి వెంకటరమణ, చిత్తూరుకు ఎమ్మెల్సీ భరత్, కోనసీమకు ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, తూర్పుగోదావరి కి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ఏలూరుకి ఎమ్మెల్యే ఆళ్ల నాని, గుంటూరుకు డొక్కా మాణిక్య వరప్రసాద్, కాకినాడకు ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కృష్ణా జిల్లాకు ఎమ్మెల్యే పేర్ని నాని, కర్నూలుకు ఎమ్మెల్యే బీ వై రామయ్య, నంద్యాలకు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎన్టీఆర్ జిల్లాకు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, పల్నాడుకు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్వతీపురం మన్యానికి శత్రుచర్ల పరీక్షిత్ రాజు, ప్రకాశంకు జంకె వెంకటరెడ్డి, నెల్లూరుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సత్య జిల్లాకు ఎమ్మెల్యే శంకర్ నారాయణ, శ్రీకాకుళానికి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్, తిరుపతికి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి, విజయనగరానికి జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పశ్చిమగోదావరి కి ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, వైయస్సార్ జిల్లాకు మేయర్ సురేష్ బాబు అధ్యక్షులుగా నియమితులయ్యారు.

గత కొద్ది రోజులుగా ముందస్తు ఊహాగానాలు రేగుతున్న సంగతి తెలిసిందే. ఇటువంటి తరుణంలో వైసిపి జిల్లాలకు నూతన కార్యవర్గాలను నియమించడం విశేషం. అయితే మంత్రులు మాత్రం షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ప్రకటిస్తున్నారు. కానీ ప్రభుత్వ హడావిడి, పార్టీ నియామకాలు చూస్తుంటే ముందస్తు ఖాయం అన్న సంకేతాలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రతిపక్షాలు కూడా అస్త్ర శాస్త్రలను సిద్ధం చేస్తున్నాయి.