National

దేశంలో 63 కొత్త ఉపరకం జేఎన్.1 కేసులు నమోదు..

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఆక్టివ్ కేసుల సంఖ్య 4,054కి చేరింది. అలాగే కొవిడ్‌ కొత్త సబ్‌ వేరియంట్‌ జేఎన్‌.1 కేసులు 63కు చేరాయని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. వాటిలో అత్యధికంగా గోవాలో 34 కేసులు నమోదు అయ్యాయి. మహారాష్ట్రలో తొమ్మిది మంది ఈ వేరియంట్‌ బారినపడ్డారు. కర్ణాటక(8), కేరళ(6), తమిళనాడు(4), తెలంగాణ(2)లో ఈ కేసులు బయటపడినట్లు కేంద్రం తన ప్రకటనలో వెల్లడించింది.

 

జేఎన్‌.1 వేరియంట్‌ సోకినవారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా కోలుకునే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయని వైద్యులు చెప్తున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం ఈ జేఎన్‌.1 వేరియంట్‌కు సంబంధించి తొలి కేసు వెలుగులోకి వచ్చింది. 79 ఏళ్ల మహిళకు సోకడంతో ఈ వేరియెంట్ కేసు తొలిసారిగా వెలుగులోకి వచ్చింది. అయితే ఆమె ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకొకుండా ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

 

ఈ కొత్తరకం కేసులు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది. అమెరికా, చైనా, సింగపూర్‌లతో పాటు భారత్‌లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని ‘వేరియంట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌’ గా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని వెల్లడించింది. వ్యాక్సిన్‌ అదనపు డోస్‌ అవసరం లేదని ప్రకటించింది.

 

ప్రస్తుతం శీతాకాల సీజన్‌‌ను పరిగణనలోకి తీసుకొని కొవిడ్ నియంత్రణ చర్యలపై తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వెల్లడించారు. కరోనా కేసులపై అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. జేఎన్‌.1 గురించి ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని వైద్యలు వెల్లడించారు. జేఎన్.1 రకం పట్ల అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు ప్రకటించారు.