National

నేడు 500 అమృత్ భారత్ స్టేషన్లకు ప్రధాని మోడీ శంకుస్థాపన..

అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద దేశవ్యాప్తంగా 500కు పైగా స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు భారత ప్రధాని నరేంద్ర మోడీ నేడు వర్చువల్ గా శంకుస్థాపన చేయనున్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ఏపీలో 34, తెలంగాణ రాష్ట్రంలో 15 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి.

 

169 కోట్ల రూపాయలతో చేపట్టే ఒక రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సహ 16 అండర్ పాస్ బ్రిడ్జిల పనులకు నేడు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. అసలు ఏమిటీ అమృత్ భారత్ స్టేషన్ల స్కీం అంటే.. 1275 రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేయడానికి సంకల్పించి రైల్వే మంత్రిత్వ శాఖ గత ఏడాది ప్రారంభించిన భారతీయ రైల్వే మిషన్ ఈ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్.

 

Prime Minister Modi lay foundation for 500 Amrit Bharat stations today.. What is this scheme?

ఈ పథకం భారత ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు ప్రయోజనాన్ని చేకూరుస్తుందని తెలుస్తోంది. స్టార్ట్ అప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ఇండస్ట్రియల్ కారిడార్, భారత్ నెట్, భారత మాల, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సాగర్ మాల వంటి ఇతర కీలకమైన భారత ప్రభుత్వ పథకాలకు అనుకూలంగాను, ప్రయోజనకరంగానూ ఈ స్కీమ్ ఉంటుంది.

 

ఈ పథకం కింద భారతీయ రైల్వే నెట్వర్క్ పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్లను మెరుగుపరచడం, ఆధునీకరణ పనులు చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఈ పథకం ద్వారా 1275 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రైల్వే స్టేషన్లలో సౌకర్యాల మెరుగుదలకు మాస్టర్ ప్లాన్స్ ను రూపొందించి వాటిని అమలు చేసే పనిలో ఉంది.

 

ఇందులో భాగంగా రైల్వే స్టేషన్లను శక్తివంతమైన నగర కేంద్రాలుగా మార్చడం, సుందరీకరణతో పాటు, అన్ని మౌలిక వసతులను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. దశలవారీగా అమలు చేస్తున్న ఈ పథకంలో ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ 500 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 రైల్వేస్టేషన్లు, తెలంగాణ రాష్ట్రంలో 73 రైల్వేస్టేషన్ల పునరాభివృద్ధి పనులు జరగనున్నాయి.