National

టికెట్ ధరలు తగ్గించిన రైల్వే..

కరోనా సమయంలో భారతీయ రైల్వే ప్యాసింజర్ రైళ్లనన్నింటినీ ఎక్స్ ప్రెస్ రైళ్లుగా మారుస్తూ వాటి చార్జీలను కూడా భారీగా పెంచింది. చిన్న చిన్న స్టేషన్లలో రైళ్లను నిలుపుదల చేయడం కూడా నిలిపివేసింది. పెద్ద పెద్ద స్టేషన్లలోనే ఆపేలా చర్యలు తీసుకుంది. దగ్గరలోని నగరాలు, పట్టణాల మధ్య తిరిగే మెము, డెముతోపాటు ప్యాసింజర్ రైళ్ల టికెట్ ధరలను కూడా పెంచింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. కనిష్టంగా రూ.10 ఉండే టికెట్ ధరలను కూడా రూ.35 నుంచి రూ.55కు పెంచారు. చిరువ్యాపారులకు, సామాన్యులకు ఇవి మోయలేని భారంగా మారాయి.

 

కరోనా అదుపులోకి రావడంతోపాటు రైళ్లన్నీ ప్రయాణికులతో కిటకిటలాడుతుండటంతో ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు తగ్గించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ధరల తగ్గింపు కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం ఉన్న మెమె, డెము, సున్నా నెంబరుతో తిరిగే రైళ్లు, ఎక్స్ ప్రెస్ పేరుతో తిరుగుతున్న ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలను 50శాతానికి తగ్గించారు. దీనికి సంబంధించిన అన్ని వివరాలను రైల్వే బోర్డు జోనల్ మేనేజర్లకు పంపించింది. ఇప్పటికే టికెట్ ధరలను సవరించగా, యూటీఎస్ లో కూడా మార్పులు చేశారు.

 

దేశవ్యాప్తంగా ప్రతిరోజు 10,748 రైళ్లు నడుస్తుండగా భవిష్యత్తులో వీటి సంఖ్యను 13వేలకు పెంచబోతున్నారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో కొత్తగా మూడువేల రైళ్లు పట్టాలెక్కుతాయి. సంవత్సరానికి 5వేల కిలోమీటర్ల ట్రాక్ అందుబాటులోకి వస్తోంది. వీటికి అనుగుణంగా కొత్త రైళ్లు కూడా ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. సంవత్సరానికి 800 కోట్ల మంది ప్రయాణికులు రైళ్లల్లో ప్రయానిస్తున్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్యను వెయ్యి కోట్లకు పెంచేలా రైల్వే చర్యలు తీసుకుంటోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు పుష్ అండ్ ఫుల్ సాంకేతికతతో రైళ్లను రూపొందిస్తోంది.