POLITICS

బీజేపీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి, ఆ పార్టీ నేతలు అరుణ్‌ సింగ్‌, లక్ష్మణ్‌ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

పార్టీ తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా పనిచేస్తానన్నారు. గతంలో మోదీ, తాను ఒకేసారి ముఖ్యమంత్రులుగా ఉన్నామని, అప్పట్లో ఆయన్ను కొన్ని సందర్భాల్లో కలిశానని, ఆయన నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

కాంగ్రెస్ ని ఎందుకు వీడానంటే..?

రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పి జై సమైక్యాంధ్ర అంటూ సొంత పార్టీ పెట్టుకున్నారు. 2014 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆయన దుకాణం మూసేశారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరారు, ఇప్పుడు మళ్లీ ఆ పార్టీకి దూరమై బీజేపీ గూటికి వచ్చారు. 60 ఏళ్లుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని, తానెప్పుడూ కాంగ్రెస్ ని వీడిపోవాలని అనుకోలేదని చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి. ఆ పార్టీ సరైన దారిలో వెళ్లడం లేదన్నారు. ప్రజా తీర్పుని కూడా వారు గౌరవించడం లేదని, తప్పులు తెలుసుకోలేదని, వాటిని సరిదిద్దుకునే ఆలోచన కూడా ఆ పార్టీ పెద్దలకు లేదని ఆరోపించారు.