Technology

స్లీప్ మోడ్‌లోకి ప్రజ్ఞాన్ రోవర్, పేలోడ్స్ టర్న్‌డ్ ఆఫ్

బెంగళూరు: చంద్రయాన్-3 (Chandrayaan-3) మిషన్‌లో భాగంగా ప్రజ్ఞాన్ రోవర్ తొలి విడత ప్రక్రియ పూర్తయింది. తనకు అప్పగించిన పనులను ప్రజ్ఞాన్ రోవర్ విజయవంతంగా పూర్తి చేసిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)తాజాగా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది.

చంద్రుడిపై పగలు(14 రోజులు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో రోవర్‌ను సురక్షిత ప్రదేశంలో స్లీప్ మోడ్‌లోకి పంపింది.

రోవర్‌కు అమర్చిన ఏపీ ఎక్స్‌ఎస్, ఎల్ఐబీఎస్ పేలోడ్ పనులను నిలిపివేసినట్లు ఇస్రో పేర్కొంది. ప్రస్తుతం ప్రజ్ఞాన్ రోవర్ బ్యాటరీ పూర్తిస్థాయిలో రీఛార్జ్ అయిందని, మళ్లీ సూర్యోదయం కాగానే కాంతిని గ్రహించేందుకు వీలుగా సోలార్ ప్యానెల్‌ను సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది.

కాగా, ఆగస్టు 23న చంద్రయాన్‌-3 చంద్రుడిపై దిగినప్పుడు చంద్రుని సూర్యోదయం జరిగింది. కాబట్టి, చంద్రునిపై తదుపరి చంద్ర సూర్యోదయం సెప్టెంబర్ 22న సంభవిస్తుందని ఇస్రో అంచనా వేసింది. అన్నీ సజావుగా సాగితే మరికొన్ని రోజుల పాటు ప్రజ్ఞాన్ తన పరిశోధనలను కొనసాగించనుంది. లేదంటే భారతదేశపు ప్రతినిధిగా చంద్రుడిపై శాశ్వతంగా ఉండిపోనుంది. ఇప్పటి వరకు రోవర్ సేకరించిన డేటాను ఇస్రో విశ్లేషన్ చేస్తోంది.