TELANGANA

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఆరా…

టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కేసులో నిందితుల ఆర్థిక లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తుంది. క్వశ్చన్ పేపర్ లీక్ కేసులో నిందితులను సిట్ కస్టడికి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 18 నుంచి నిందితులను సిట్ టీమ్ ప్రశ్నిస్తుంది. ఇవాళ రెండో రోజున సిట్ అధికారులు నిందితులను విచారిస్తున్నారు. 2022 అక్టోబర్ నెల నుంచి జరిగిన ఏడు పరీక్షలపై కూడా సిట్ టీమ్ ఫోకస్ పెట్టింది. ఈ ఏడు పరీక్షల్లో అత్యధిక మార్కులు వచ్చిన అభ్యర్థులపై సిట్ నజర్ పెట్టింది. ఈ ఏడు పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఏమైనా లీయయ్యాయా అనే కోణంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

 

గతేడాది అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏడు పరీక్షలను తెలంగాణ పబ్లీకి సర్వీస్ కమిషన్ నిర్వహించింది. ఫుడ్ సేప్టీ ఆఫీసర్, సీపీడీఓ, సూపర్ వైజర్ గ్రేడ్2, ఏఈఈ, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, ఏఈ పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పటికే ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైందని సిట్ టీమ్ గుర్తించింది. మిగిలిన పరీక్షలు జరిగిన తీరుపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టారు. గ్రూప్-1 ప్రిలిమ్స్, ఏఈఈ,డీఏఓ పరీక్షలను రద్దు చేస్తున్నట్లుగా తెలంగాణ పబ్లీక్ సర్వీస్ కమిషన్ రెండు రోజుల క్రితం ప్రకటించింది.

 

ఈ నెల 5వ తేదీన జరిగిన ఏఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రంతో పాటు మరో నాలుగు ప్రశ్నాపత్రాలను కూడా ప్రవీణ్ పెన్ డ్రైవ్ లో డౌన్ లోడ్ చేసుకున్నారని సిట్ టీమ్ గుర్తించింది. పేపర్ లీక్ కేసులో ప్రవీణ్, రాజశేఖర్ లు కీలకంగా వ్యవహరించినట్లుగా సిట్ టీమ్ గుర్తించింది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఇప్పటికే తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ కు చెందిన రేణుక కొందరికి ఈ పేపర్ ను విక్రయించినట్లుగా పోలీసులు గుర్తించారు. పేపర్ లీక్ కేసులో లావాదేవీల విషయంలో చోటు చేసుకున్న విభేదాల కారణంగానే ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు గుర్తించారు.