TELANGANA

టీఎస్ఆర్టీసీ లక్కీ లాటరీ టికెట్: బస్సు ఎక్కితే లక్షల బహుమతి, రేపట్నుంచే

హైదరాబాద్: వినియోగదారుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) ఆకట్టుకునేందుకు అనేక సరికొత్త పథకాలను తీసుకొస్తొంది. తాజాగా, బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తోన్న లక్కీ డ్రా బుధవారం నుంచి ప్రారంభమవుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 30 వరకు ఇది కొనసాగుతుంది.

టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం పూర్తయ్యాక టికెట్ వెనకాల పేరు, వారి ఫోన్ నంబర్‌ను రాసి.. వాటిని బస్టాండ్లలో ఏర్పాటు చేసిన డ్రాప్ బాక్స్‌లలో ప్రయాణికులు వేయాలి. బస్టాండ్లు, ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లలో మహిళలు, పురుషులకు వేర్వేరుగా డ్రాప్ బాక్స్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

ప్రతి రీజియన్ కేంద్రంలో లక్కీ డ్రా నిర్వహించి 10 మంది చొప్పున విజేతలను అధికారులు ఎంపికచేస్తారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందిన ప్రయాణికులకు రూ.11 లక్షల నగదు బహుమతులను టీఎస్ఆర్టీసీ సంస్థ అందించనుంది.

ప్రతి రీజియన్ కు ఐదుగురు పురుషులు, ఐదుగురు మహిళలు.. మొత్తం 110 మందికి ఒక్కొకరికి రూ.9900 చొప్పున బహుమతులను ఇవ్వనుంది. బతుకమ్మ, దసరా పండుగలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు రాఖీ పౌర్ణమి మాదిరిగానే ఈ లక్కీ డ్రా సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆర్టీసీ సంస్థ కోరింది.

జూబ్లీ బస్టాండ్ నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులు

దసరా పండగ సందర్భంగా తెలుగు ప్రజలకు ముఖ్యంగా ఏపీ వాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) గుడ్‌న్యూస్ చెప్పింది.ప్రయాణికుల విజ్ఞప్తుల మేరకు జూబ్లీ బస్ స్టేషన్ (JBS) మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది.

బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి బయలుదేరే 24 సర్వీసులను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా నడపనుంది. ఆ సర్వీసులు కేపీహెచ్ బీ కాలనీ, బాలానగర్, బోయిన్ పల్లి, జేబీఎస్, సంగీత్ (పుష్పక్ పాయింట్), తార్నాక (పుష్పక్ పాయింట్), హబ్సిగూడ (పుష్పక్ పాయింట్), ఉప్పల్ (పుష్పక్ పాయింట్) , ఎల్బీనగర్ మీదుగా విజయవాడకు నడుస్తాయి.

అక్టోబర్ 18 నుంచే ఈ 24 సర్వీసులు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తాయి. జేబీఎస్ మీదుగా వెళ్లే ఈ బస్సుల టికెట్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ఎంజీబీఎస్ నుంచి నడిచే సర్వీసుల మాదిరిగానే ఛార్జీలుంటాయి. ఈ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం
https://tsrtconline.in
ను సంప్రదించవచ్చు.

ప్రస్తుతం బీహెచ్ఈఎల్/మియాపూర్ నుంచి వచ్చే బస్సులు ఎంజీబీఎస్ మీదుగా విజయవాడకు వెళ్తున్నాయి. దీంతో జేబీఎస్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల ప్రయాణికులు ఎంజీబీఎస్ కు రావాల్సి వచ్చేది. ఈ విషయాన్ని కొందరు ప్రయాణికులు టీఎస్ఆర్టీసీ యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

జేబీఎస్ మీదుగా విజయవాడకు బస్సులను నడపాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తుల మేరకు మొదటగా 24 సర్వీసులను జేబీఎస్ మీదుగా విజయవాడకు నడపాలని సంస్థ నిర్ణయించింది. బోయిన్ పల్లి, సికింద్రాబాద్, జేబీఎస్, తార్నాక , హబ్సిగుడ, ఉప్పల్ ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరమైన ఈ బస్సులను వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ కోరుతోంది.