TELANGANA

“కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది”.. కాళేశ్వరం అవినీతిపై రేవంత్ ధ్వజం..

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించి.. దానిపై వాస్తవాల గురించి మాట్లాడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు . అంచనాలను పెంచి దోపిడీ చేశారని మంత్రి కేటీఆర్‌కు కౌంటరిచ్చారు. నిపుణుల నివేదికను సీఎం కేసీఆర్ ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తానికి తానే కర్త,కర్మ,క్రియ అని చెప్పిన కేసీఆర్.. మేడిగడ్డ పిల్లర్ కుంగిపోగానే ఆ నెపాన్ని సాంకేతిక నిపుణుల మీదికి తోసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు.

 

కాళేశ్వరం ప్రాజెక్టుతో కేసీఆర్ అవినీతి మొత్తం బయటపడిందని, రీ డిజైన్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. కేసీఆర్ ఒక ఆర్థిక ఉగ్రవాది అని, ఆర్థిక నేరం కింద ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి అనుకున్న డిజైన్ ఒకటి.. అక్కడ నిర్మించింది మరొకటన్నారు. మేడిగడ్డ డొల్లతనాన్ని కేంద్రబృందం బయటపెట్టిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి.. ప్రాజెక్టులో జరిగిన అవినీతికి కారణం కేసీయారేనని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.38,500 కోట్లు కాగా.. దానిని రూ.1.50 వేల కోట్లకు పెంచి అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. అంచనా వ్యయం చూపించారే తప్ప.. ఇప్పటికీ యాభై శాతానికి పైగా పనులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని ఆరోపించారు. కేంద్రం కూడా కేసీఆర్ ను కాపాడే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

 

ఇతర రాష్ట్రాల అధికారులతో దీనిపై కమిటీ వేసి ప్రాజెక్ట్ మొత్తాన్ని పరిశీలించాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి 2023 వరకూ కాళేశ్వరం ప్రాజెక్ట్ వెనుక కేసీఆర్, హరీశ్ రావులే ఉన్నారని, వారిని వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం డిజైన్ కు అనుగుణంగా జరగలేదని, ఇందులో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. నిర్మాణం, నిర్వహణ, డిజైన్, ప్లానింగ్ లోపం వల్ల రాష్ట్రానికి తీరని నష్టం జరిగిందన్నారు. కేంద్ర విజిలెన్స్ కమిషన్ ద్వారా నివేదిక తెప్పించి.. దానిపై సీబీఐతో సత్వరమే విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.