TELANGANA

బీజేపీతో ఓవైసీ సోదరుల రహస్య బంధం.. అక్బరుద్దీన్‌కి లాయర్‌గా రఘునందన్‌రావు..

ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అంటారు. అవును ఇప్పుడు ఓవైసీ సోదరులు కూడా ఇలాగే ఎగిరిపడుతున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ-మజ్లిస్‌ మధ్య ఉన్న రహస్యం బంధాన్ని నిలదీస్తుండగా రేవంత్‌పై భగ్గుమంటున్నారు. మైనార్టీల మనోభావాలతో ఆటలాడుతున్న అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ని…. రేవంత్‌ నిలదీస్తుండగా.. ఆయన్ని కొరకరాని కొయ్యగా భావిస్తున్నారు. అడిగిన ప్రశ్నలకి జవాబివ్వకుండా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. చీప్‌ కామెంట్స్‌ చేస్తూ మైనార్టీలని తప్పుదోవ పట్టిస్తున్నారు.

 

రేవంత్‌ విసిరిన సవాల్‌కి.. ఓవైసీ సోదరులు ఆన్సర్‌ చేయకుండా.. గతంలో RSSలో పనిచేశానని క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇష్యూ చేయాలని ట్రై చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఓవైసీ బ్రదర్స్‌ MIM ఎన్నికల ప్రచారంలో రేవంత్‌రెడ్డి జపం చేస్తున్నారు.

 

పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలే ఎంఐఎం అగ్రనేతలు అసదుద్దీన్‌, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ని ఒంటికాలుపై లేచేలా చేశాయి. రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా తప్పుదోవ పట్టించేలా RSS ప్రస్తావన తీసుకొస్తూ సోదరులు ఇద్దరూ మాటల దాడికి దిగారు. కొద్దిరోజులుగా మజ్లస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ఉన్న రహస్యం స్నేహాన్ని రేవంత్‌రెడ్డి బయటపెడుతున్నారు. MIM మైనార్టీలకు ద్రోహం చేస్తూ బీజేపీ గెలిచేలా పనిచేస్తోందని నిజాలు బయట పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా.. ముస్లింల ఓట్లు చీల్చి బీజేపీ గెలిచేలా.. మజ్లిస్‌ పార్టీ పనిచేస్తోందని రేవంత్‌రెడ్డి ఎండగడుతున్నారు.

 

కర్ణాటకలోనూ అదే చేశారని.. తెలంగాణలోనూ ఇదే ఫార్మూలాతో ఓవైసీ సోదరులు పనిచేస్తున్నారని గట్టిగా నిలదీస్తున్నారు. కామారెడ్డిలో షబ్బీర్‌ అలీ పోటీ చేయకుండా కుట్రలు చేశారని.. అలాగే జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌పై MIM అభ్యర్థిని పోటీకి దింపడాన్ని ప్రశ్నిస్తున్నారు. మరి గోషామహల్‌లో రాజాసింగ్‌పై కేసీఆర్‌గానీ… MIM గానీ… ఎందుకు పోటీ చేయడం లేదని ఫైరవుతున్నారు. గతంలో అక్బరుద్దీన్‌కి రఘునందన్‌రావు లాయర్‌గా బెయిల్‌ ఇప్పించారని గుర్తుచేస్తున్నారు రేవంత్‌.

 

బీజేపీతో ఓవైసీ సోదరుల లింకులను రేవంత్‌ బయటపెడుతున్నారు. మోడీ, అమిత్‌ షా సన్నిహితుడికి తన ఇంట్లో విందు ఇవ్వలేదని ఓవైసీ సోదరులు ప్రమాణం చేసేందుకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు.

 

తాను గతంలో RSSలో పనిచేశానని ఎప్పుడో క్లారిటీ ఇచ్చారు రేవంత్‌. మజ్లిస్‌ అసలు బండారాన్ని ఎండగడుతుండగా.. దానికి బలం చేకూర్చేలా MIM నేత ఖాజా బిలాల్‌ సంచలన ఆరోపణలు చేశారు. గోషామహల్‌ అభ్యర్థిని పోటీలో నిలపడంపై మజ్లిస్‌ సాకులు వెతుకుతోందనే విషయం బట్టబయలు చేశారు. గోషామహల్ నుంచి పోటీ చేస్తానంటే అసదుద్దీన్ ఓవైసీ టికెట్ ఇవ్వలేదని అసలు గుట్టును రట్టు చేశారు. దాదాపు 80 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నా.. మజ్లిస్‌ పోటీకి ఎందుకు సుముఖంగా లేదని ఖాజా బిలాల్ ప్రశ్నించడం ఓవైసీ సోదరులకి షాకిచ్చేలా చేసింది. మరోవైపు MIM ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్‌, ఆయన సోదరుడు అక్బరుద్దీన్‌ రేవంత్‌రెడ్డి జపం చేస్తున్నారు.

 

మజ్లిస్‌, బీఆర్ఎస్‌, బీజేపీ మధ్య బంధం బయటపడుతోందనే అక్కసుతోనే ఓవైసీ సోదరులు వ్యక్తిగత ఆరోపణలకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. మజ్లిస్‌ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారంలో గతానికి భిన్నంగా రేవంత్‌రెడ్డి జపం చేస్తున్నారు. అన్ని చోట్లా రేవంత్‌రెడ్డిని విమర్శించడానికే పరిమితం అవుతున్నారు. బీఆర్ఎస్‌తో మైత్రి వల్ల ప్రభుత్వ పనితీరుని ప్రశ్నించలేకపోతున్నారు. అలాగే బీజేపీతో సీక్రెట్‌ అండర్‌స్టాండింగ్‌తో కేంద్రం పాలనని ఓవైసీ బ్రదర్స్‌ క్వశ్చన్‌ చేయలేకపోతున్నారనే టాక్‌ నడుస్తోంది. ఇక రేవంత్‌రెడ్డిని మాత్రమే టార్గెట్‌ చేయడం మైనార్టీలని ఆలోచనలో పడేస్తోంది. మరోవైపు కర్ణాటక తరహా కుట్రల పట్ల మైనార్టీలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న రేవంత్…. కాంగ్రెస్‌ పార్టీతోనే మైనార్టీలకి రక్షణ అని భరోసా ఇస్తున్నారు.

 

దేశవ్యాప్తంగా మజ్లిస్‌ పార్టీ బీజేపీ ముసుగులో పనిచేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. హిందువుల ఓట్లపై కమలం పార్టీ గురిపెడుతుండగా.. ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కి పడకుండా చీలికకు MIM పనిచేస్తోందనే బలమైన వాదనలు ఉన్నాయి. తెలంగాణ సహా అనేక రాష్ట్రాల్లో మజ్లిస్‌ వ్యవహారం బయటపడతుండగా ఓవైసీ సోదరులపై మైనార్టీల్లో అనుమానాలు బలపడుతున్నాయి. దీన్ని రేవంత్‌రెడ్డి మరింత గట్టిగా ప్రూవ్‌ చేస్తుండగా అసదుద్దీన్‌, అక్బరుద్దీన్‌ సరైన సమాధానం చెప్పకుండా దాటవేత ధోరణి ప్రదర్శించడం దేనికి సంకేతం అని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు.