TELANGANA

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్: ఎన్నిక నోటిఫికేషన్ విడుదల.! రేసులో ఆ సీనియర్ నేత..!!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. మంత్రి వర్గం ఏర్పాటైంది. కొత్తగా అసెంబ్లీ ఎన్నికైన వారు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది సభ్యులు మినహా మిగిలినవారంతా ప్రమాణం చేశారు.

 

ఇక- తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికోసం లెజిస్లేచర్ సెక్రెటేరియట్.. కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఉదయం 10:30 గంటలకు కొత్త స్పీకర్ ఎవరనేది ప్రకటిస్తారు. 13వ తేదీన ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలకు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.

 

కీలకమైన ఈ స్పీకర్ పదవి కోసం కాంగ్రెస్ పార్టీ సీనియర్ శాసన సభ్యుడు, మాజీ మంత్రి, దళిత నేత గడ్డం ప్రసాద్ కుమార్ (G Prasad Kumar) పేరు ఖరారైంది. ఆయనను స్పీకర్‌గా అపాయింట్ చేస్తూ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఇదివరకే ఓ ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.

 

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జీ ప్రసాద్.. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, భారత్ రాష్ట్ర సమితికి చెందిన డాక్టర్ మెతుకు ఆనంద్‌పై 12, 893 ఓట్ల మెజారిటీతో విజయఢంకా మోగించారు. గడ్డం ప్రసాద్‌కు మొత్తం 86,885 ఓట్లు పోల్ అయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థికి 73,992 ఓట్లు పడ్డాయి.

 

2009లో జీ ప్రసాద్.. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహించారు. ఆ తరువాత 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో పరాజయాన్ని చవి చూశారు. అయినప్పటికీ- ఆయనపై నమ్మకంతో వికారాబాద్ టికెట్‌ను కేటాయించింది కాంగ్రెస్ అధిష్ఠానం. ఈ సారి 12 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు.

 

ప్రసాద్ కుమార్‌ను తొలుత కేబినెట్‌లోకి తీసుకుంటారనే ప్రచారం జరిగింది. స్పీకర్‌గా దుద్దిళ్ల శ్రీధర్ బాబును ఎంపిక చేస్తారంటూ వార్తలొచ్చాయి. స్పీకర్ పదవిని తీసుకోవడానికి శ్రీధర్ బాబు ఆసక్తి చూపలేదు. మంత్రిగా పని చేయడానికే ప్రాధాన్యతను ఇచ్చారు. దీనితో ప్రసాద్ కుమార్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం స్పీకర్‌గా అపాయింట్ చేసింది.