TELANGANA

రైతుబంధు నిధుల విడుదలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్..

రైతుబంధు ఎప్పడిస్తారంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించిన నేపథ్యంలో వరుసగా మంత్రులు స్పందిస్తున్నారు. రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం డిసెంబర్ ఆఖరిలో ఇచ్చేదని.. తాము కూడా అలాగే ఇస్తామని తెలిపారు. ⁠బీఆర్ఎస్ప్రతిపక్షంలోకి రాగానే రైతుబంధు ఎప్పుడు ఇస్తారని మాజీ మంత్రులు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.

 

మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా గజ్వేల్‌కు వచ్చిన పొన్నం ప్రభాకర్‌కు డీసీసీ అధ్యక్షుడు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. డిసెంబర్ 3వ తేదీన ఎన్నికల ఫలితాలు వస్తే.. 9న ఆరు గ్యారంటీలలో 2 గ్యారంటీలను ప్రారంభించామని తెలిపారు. ⁠రవాణా శాఖ పరిధిలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామని వెల్లడించారు. ఆరోగ్య శ్రీ పథకాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు.

 

Minister Ponnam Prabhakar Clarify on Rythu Bandhu Scheme fund release issue

ఇచ్చిన ప్రకారం 6 గ్యారంటీలను 100 రోజుల్లో ప్రారంభిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ⁠ఈ ప్రభుత్వాన్ని నడవనీయమని ప్రతిపక్షాలు అంటున్నారని మండిపడ్డారు. రైతుకు పెట్టుబడి 100 శాతం ఇస్తామన్నారు. గతంలో ఇచ్చిన విధంగానే రైతుబంధు ఇస్తామని, కేసీఆర్ గజ్వేల్ నుంచి గెలిచాక ఒక్కసారైనా ఇక్కడి ప్రజలను కలవలేదని మంత్రి పొన్నం మండిపడ్డారు.

 

ప్రగతిభవనాన్ని ప్రజాభవన్గా మార్చామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రజల సమస్యలను అక్కడ తెలుసుకునే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాస్వామ్య పాలనను అందిస్తామని, భూ నిర్వాసితులతో కూలంకషంగా మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హమీ ఇచ్చారు. ⁠రైతుబంధులోని లోపాలను సవరించి వీలైనంత త్వరలో రైతు బంధు నగదు అందిస్తామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. డిసెంబర్ చివరి నాటికి రైతుబంధు నిధులు రైతులకు అందుతాయన్నారు.