TELANGANA

భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలి.. అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి…

రీజనల్‌ రింగ్‌ రోడ్డు(Regional Ring Road) ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. భూ సేకరణతో పాటు ఆర్‌ఆర్‌ఆర్‌(నార్త్) పనులకు టెండర్లు పిలవాలని పేర్కొన్నారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు అవతల నిర్మించే ఈ రీజినల్‌ రింగ్‌ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది.

 

ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని సీఎం రేవంత్ రెడ్డి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)ను కోరారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సౌత్ భాగం తదుపరి భూసేకరణకు ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి.

 

భారత్ మాల పరియోజన ఫేజ్ ‌‌వన్ లో రీజనల్ రింగ్ రోడ్డు.. 158 కిలోమీటర్ల మేరకు తలపెట్టారు. ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు.. తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. మొత్తం 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా.. ఇప్పటివరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. గత ప్రభుత్వం చేసిన కాలయాపన కారణంగా తొమ్మిది నెలలుగా ఈ ప్రాజెక్టు భూసేకరణలో ఎటువంటి పురోగతి లేదు. నేషనల్ హైవే అథారిటీతో తలెత్తిన చిక్కుముడులను పరిష్కరించే ప్రయత్నం జరగలేదు. దీంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది సీఎం రేవంత్ సర్కార్.

 

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని వేగవంతం చేసేందుకు తెలంగాణను మూడు క్లస్టర్లుగా విభజించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఔటర్ రింగ్ రోడ్డు లోపల అర్బన్ తెలంగాణ.. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ రీజనల్ రింగ్ రోడ్డు వరకు సెమీ అర్బన్ తెలంగాణ, రీజనల్ రింగ్ రోడ్డు తర్వాత ఉన్న ప్రాంతాన్ని రూరల్ తెలంగాణ క్లస్టర్ గా గుర్తించి పరిశ్రమల స్థాపనకు కొత్త విధానాన్ని రూపొందిస్తోంది. ఇందులో భాగంగా రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును అత్యంత వేగంగా పూర్తి చేయాల్సిన అవశ్యాన్ని సీఎం అధికారులతో చర్చించారు. ఈ RRR పూర్తయితే రవాణా సదుపాయాలతో సెమీ అర్బన్ జోన్లో కొత్త పరిశ్రమలు రావటంతో పాటు అభివృద్ధి వేగం పుంజుకుంటుందని అన్నారు.

 

నిలిచిపోయిన భూసేకరణను రాబోయే 3 నెలలలో పూర్తి చేయాలని, భూసేకరణతో పాటే RRR పనులకు టెండర్లు పిలవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దక్షిణ భాగాన్ని జాతీయ రహదారిగా ప్రకటించాలని.. తదుపరి భూసేకరణ ప్రణాళికను రూపొందించాలని NHAI ని కోరారు. RRRను పూర్తి చేసేందుకు ఆర్థికంగా ఎంత భారమైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి ఉపయోగపడే ఏ కార్యాన్నైనా నిర్వహించడానికి ప్రభుత్వం పని చేస్తుందని పేర్కొన్నారు.