TELANGANA

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ అధికారులు సమన్లను జారీ..

దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత.. ఈ కేసులో మరోసారి విచారణను ఎదుర్కొనాల్సిన పరిస్థిితి ఏర్పడింది.

 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును దర్యాప్తు చేస్తోన్న సీబీఐ అధికారులు కవితకు సమన్లను జారీ చేశారు. ఈ నెల 26వ తేదీన విచారణకు రావాల్సి ఉంటుందంటూ ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఇదే కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా సమన్లు ఇచ్చినప్పటికీ.. దానికి హాజరు కాలేదు కవిత.

 

ఈ కేసులో ఆమె ఇదివరకు దర్యాప్తును ఎదుర్కొన్న విషయం తెలిసిందే. రెండుసార్లు ఆమె ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. విచారణకు హాజరయ్యారు. తాజాగా ఈ కేసులో సీబీఐ జోక్యం చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. సుప్రీంకోర్టులో పిటీషన్ నేపథ్యంలో ఈడీ సమన్లకు స్పందించకపోవడం వల్ల కవితకు సీబీఐ సమన్లను ఇచ్చిందని తెలుస్తోంది.

 

లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొనడానికి బీఆర్ఎస్ సిద్ధమౌతున్న ప్రస్తుత పరిస్థితుల్లో- సీబీఐ అధికారులు కవితకు సమన్లు ఇవ్వడం అటు రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో లేదు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది.

 

ఈ పరిస్థితుల్లో కవిత.. సీబీఐ నుంచి సమన్లను అందుకోవడం చర్చనీయాంశమౌతోంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్, ఎంపీ సంజయ్ సింగ్.. విచారణను ఎదుర్కొంటోన్నారు. జైలు జీవితాన్ని గడుపుతోన్నారు.