TELANGANA

తెలంగాణలో రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లకు కీలక పదవులు..!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కారు పలువురు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ లను కీలక పదవుల్లో నియమించింది. ఈ క్రమంలోనే టీటీడీ జేఈవోగా సేవలందించిన మాజీ ఐఏఎస్ అధికారి కె.ఎస్. శ్రీనివాసరాజును ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఆయన ఈ బాధ్యతను రెండు సంవత్సరాల పాటు నిర్వర్తించనున్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు చెందిన శ్రీనివాసరాజు గతంలో సుదీర్ఘ కాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవోగా బాధ్యతలు నిర్వహించారు.

 

తాజాగా పదవీ విరమణ చేసిన మాజీ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ప్రభుత్వం మళ్లీ కీలక భాద్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ) వైస్ చైర్‌పర్సన్‌గా నియమించడంతో పాటు, డైరెక్టర్ జనరల్ (డీజీ)గా కూడా అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం సీఎస్‌గా కె. రామకృష్ణారావు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

 

మరోవైపు సీజీజీ డైరెక్టర్ జనరల్‌గా ఇటీవల నియమితులైన సీనియర్ ఐఏఎస్ అధికారి శశాంక్ గోయల్‌ను ఢిల్లీ తెలంగాణ భవన్‌కు ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.

 

భద్రత విభాగానికి కమలాసన్ రెడ్డి..

 

పదవీ విరమణ పొందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వి.బి. కమలాసన్ రెడ్డిని.. రాష్ట్ర నిఘా, భద్రత విభాగానికి ప్రత్యేకాధికారిగా (OSD) ప్రభుత్వం మళ్లీ నియమించింది. ఆయన ఈ బాధ్యతను రెండేళ్లపాటు నిర్వహించనున్నారు. అలాగే, ఇంటిగ్రేటెడ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్‌గా కూడా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. కమలాసన్ రెడ్డి ఇంతకుముందు ఔషధ నియంత్రణ విభాగం డీజీగా, ఆబ్కారీ శాఖ సంచాలకుడిగా సేవలందించారు. ఇప్పుడు ఆయన స్థానంలో సీఎం కార్యాలయ కార్యదర్శిగా ఐపీఎస్ అధికారి షానవాజ్ ఖాసీంను ప్రభుత్వం నియమించింది.