TELANGANA

చర్చకు సిద్ధమా..? మంగ్లీకి అడ్వకేట్ సుబ్బారావు స్ట్రాంగ్ కౌంటర్..

సినీ గాయకురాలు మంగ్లీ చుట్టూ ముసురుకున్న ఆర్థిక మోసం వివాదం ఇప్పుడు మ‌రో మ‌లుపు తిరిగింది. పరస్పర ఫిర్యాదులు, సవాళ్లతో ఈ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. వందల కోట్ల రూపాయల పెట్టుబడుల స్కామ్‌లో తన ప్రమేయం లేదని మంగ్లీ వాదిస్తుంటే, ఆమె ప్రమేయానికి సంబంధించి పక్కా ఆధారాలు ఉన్నాయని న్యాయవాది సింగపోగు సుబ్బారావు గట్టిగా వాదిస్తున్నారు. బుధవారం ఈ ఇరు పక్షాలు డీజీపీ కార్యాలయాన్ని ఆశ్రయించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

 

డీజీపీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడిన మంగ్లీ, తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. వందల కోట్ల వసూళ్లతో తనకు ఎలాంటి సంబంధం లేదని, అసత్య ప్రచారాల వల్ల తాను మానసికంగా నలిగిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఒకవేళ తప్పు చేసినట్లు నిరూపిస్తే జైలుకైనా వెళ్లడానికి సిద్ధం.” అని ఆమె ప్రకటించారు. తన పేరును వాడుకుని కొందరు ఈ మోసానికి పాల్పడి ఉండవచ్చని, బాధితులకు న్యాయం జరగాలని తానూ కోరుకుంటున్నానని పేర్కొన్నారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న రమావత్ మధు, హేమాకాంత్ రెడ్డి, అడ్వకేట్ సుబ్బారావులపై ఆమె డీజీపీకి ఫిర్యాదు చేశారు.

 

మంగ్లీ చేసిన వ్యాఖ్యలకు న్యాయవాది సుబ్బారావు దీటుగా సమాధానమిచ్చారు. మంగ్లీకి బాధితులపై నిజంగానే ప్రేమ ఉంటే, రేపు (గురువారం) ఉదయం 12 గంటలకు డీజీపీ ఆఫీస్‌కు లేదా మధ్యాహ్నం 2 గంటలకు బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌కు తన సోదరులతో కలిసి రావాలని ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రమావత్ మధు కంపెనీలో మంగ్లీ సోదరుడు శివ భాగస్వామిగా ఉన్నాడని, ఈ వ్యవహారమంతా మంగ్లీ కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ఆరోపించారు. గతంలో మంగ్లీ తనను క్షమాపణలు కోరిందని, కానీ ఆమె ఇచ్చే ఆఫర్లకు తాను లొంగిపోనని, బాధితులకు పైసా పైసా ఇప్పించే వరకు పోరాటం ఆపనని తేల్చి చెప్పారు.

 

ఈ వివాదంలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రమావత్ మధు కంపెనీలో మంగ్లీ సోదరుడి పాత్రపై వస్తున్న ఆధారాలు ఇప్పుడు కీలకంగా మారాయి. వందలాది మంది బాధితులు తమ కష్టార్జితం తిరిగి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ వివాదంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న‌ మంగ్లీ స్వయంగా మీడియా ముందుకు రావ‌డం, లాయర్ సుబ్బారావు వెనక్కి తగ్గకపోవడంతో ఈ కేసులో మున్ముందు ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపటి ప్రెస్ క్లబ్ సమావేశం ఈ కేసులో ఒక కీలక మలుపు కానుంది.