AP

వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ..!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ 50 ఇళ్లకు ఒకరి చొప్పున నియమించిన గ్రామ, వార్డు వాలంటీర్లు అధికార పార్టీ కోసమే పనిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పాటు విపక్షాలు వాలంటీర్లను టార్గెట్ చేస్తూ పలు ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలో అధికారం మారితే కచ్చితంగా వాలంటీర్లను తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇప్పటికే నెలకు 5 వేల గౌరవ వేతనంతో పనిచేస్తున్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది.

 

ఈ నేపథ్యంలో గతంలో వాలంటీర్లపై పలు విమర్శలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు రూటు మార్చారు. ఎన్నికల వేళ వాలంటీర్లలో ఉన్న ఆందోళన గమనించి వారికి కీలక హామీ ఇచ్చారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్లను కొనసాగించి తీరుతామని పెనుకొండలో జరిగిన పార్టీ సభలో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగించబోమని తేల్చిచెప్పశారు.

 

వాలంటీర్లు ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించబోమని, అలాంటి ఆలోచనే చేయబోమని చంద్రబాబు హామీ ఇచ్చారు. వారికి కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు.తప్పకుండా వాలంటీర్ల వ్యవస్ధను కొనసాగిస్తామన్నారు. కాబట్టి వాలంటీర్లు ఎవరూ వైసీపీ కోసం పనిచేయొద్దని చంద్రబాబు సూచించారు. ఇప్పటికే రాష్ట్రంలో వాలంటీర్లు ఎన్నికల విధుల్లో జోక్యం చేసుకుంటున్నారని, వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఈసీకి టీడీపీతో పాటు జనసేన కూడా పలు ఫిర్యాదులు చేశాయి. దీంతో కలెక్టర్లు కూడా వీరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.