క్వాంటమ్ టెక్నాలజీ విప్లవంలో అమరావతి తనదైన ముద్ర వేయనుంది. రెండు స్వదేశీ క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీ సెంటర్లు-టెస్ట్ బెడ్ ఆవిష్కరించనున్నారు సీఎం చంద్రబాబు. దీంతో దేశానికి క్వాంటమ్ హబ్గా అమరావతి అవతరించనుంది.
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ తొలి అడుగు
దేశంలో తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో టెస్ట్ బెడ్స్ని ప్రారంభించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గ్లోబల్ క్వాంటమ్ టెక్నాలజీ రోజు మంగళవారం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తం రెండు టెస్టింగ్ బెడ్లను జాతికి అంకితం చేయనున్నారు. క్వాంటమ్ వ్యాలీలో భాగంగా వన్-ఎస్ టెస్ట్బెడ్ను ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, వన్- క్యూ టెస్ట్ బెడ్ను గన్నవరంలోని మేధా టవర్స్లో ఏర్పాటు చేశారు.
ఎస్ఆర్ఎం వర్సిటీలో ఏర్పాటు చేసిన సెంటర్ను ఇవాళ ప్రారంభిస్తారు సీఎం చంద్రబాబు. దీంతో అమరావతి టెక్ శకంలో నూతన అధ్యాయానికి అడుగు పడనుంది. వీటితో ప్రత్యేకమైన క్వాంటమ్ పరీక్షలు చేసి ధ్రువీకరించగలిగిన దేశంలో తొలి రాష్ట్రంగా ఏపీ మారనుంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రెండు ఫెసిలిటీ సెంటర్లు.. హార్డ్వేర్ పరిశోధనలకు, పరీక్షలకు ఉపయోగపడతాయి.
ఈ సెంటర్ల ద్వారా పరిశోధకులు, విద్యార్థులు, స్టార్ట ప్స్, క్వాంటమ్పై పనిచేసే కంపెనీలు రకాల పరీక్షల ద్వారా పని తీరు నిర్ధారించుకోవడం మరింత ఈజీకానుంది. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వంటి సంస్థలు సాంకేతిక సహాయాన్ని అందించాయి.
దేశంలో తొలిసారి ఏర్పాటవుతున్న టెస్ట్ బెడ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేషనల్ క్వాంటమ్ మిషన్ ప్రతినిధులు, ఐఐటీ ప్రొఫెసర్లు హాజరుకానున్నారు. క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్స్, క్రిప్టోగ్రఫీ రంగాలలో సామర్థ్యాలను పెంపొందించుకోవడానికి వివిధ దేశాలు పోటీ పడుతున్నాయి. క్వాంటం ఆవిష్కరణలకు కేంద్రంగా అమరావతిని ప్రపంచ పటంలో నిలపడమే లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
రెండు క్వాంటమ్ టెస్ట్ బెడ్లు అందరికీ అందుబాటులో ఉంటాయి. ఓపెన్ యాక్సిస్ వల్ల టెక్ విద్యార్థులు.. హార్డ్వేర్ పరికరాలు, వాటి పని తీరుపైనా అవగాహన పెంచుకునేందుకు వీలుంటుందని చెబుతున్నారు. దీనిలో ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే.. క్వాంటమ్ కంప్యూటర్లలో చిప్స్ను – 263 నుంచి 273 సెంటీగ్రేడ్ మధ్య ఉంచుతారు.
వాటి కోసం కూలింగ్ కంప్రెషర్లు ప్రత్యేకంగా ఉంటాయి. అల్యూమినియం, రాగి సిలెండర్లలో ఉంచుతారు. ఎక్కువగా కూలింగ్ చేయడం వల్ల క్వాంటమ్ కంప్యూటర్ వద్ద విపరీతమైన వేడి ఏర్పడుతుంది. కూలింగ్ కోసం వినియోగించే హీలియం గ్యాస్ బహిరంగ మార్కెట్లో లీటరు రూ. 5 వరకు ఉంటుందని నిపుణుల మాట.

