CINEMA

మరోసారి భీష్మ కాంబో..

నితిన్, రశ్మికా మందణ్న, వెంకీ కుడుముల కాంబోలో గతంలో వచ్చిన ‘భీష్మ’ సినిమా ఎంత మంచి విజయం సాధించిందో అందరికీ తెలుసు. ఆ చిత్రం ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి సందేశం ఇస్తూనే.. ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేసింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కూడా బాగానే కురిపించింది. ఇప్పుడు ఈ కాంబో మరో ప్రాజెక్ట్ కోసం జతకట్టింది. ఉగాది పండుగ పర్వదినాన.. ఒక ఫన్నీ వీడియో ద్వారా ఈ కాంబోలో కొత్త సినిమా తెరకెక్కనున్నట్టు ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. ఇంకా ఈ సినిమాకు టైటిల్ ఖరారు చేయలేదు కానీ.. #VNRTrio అనే హ్యాష్‌ట్యాగ్‌నే వర్కింగ్ టైటిల్‌గా కొనసాగిస్తున్నారు.

 

అసలు ఆ వీడియోలో ఏముందంటే.. మొదట నితిన్ ఎంట్రీ ఇస్తారు. ఇంకా ఎవరు రాలేదా? అని ఒకతడ్ని అడిగితే.. ఆల్రెడీ హీరోయిన్ వచ్చేసిందని చెప్తాడు. అప్పుడు రశ్మికా మందణ్ణ ఎంట్రీ ఇచ్చి.. నితిన్‌తో హిట్, ఫెయిల్యూర్‌పై ఫన్నీ చర్చ పెడుతుంది. వీళ్లిద్దరు మాట్లాడుతుండగానే.. జీవీ ప్రకాశ్ హీరో లెవెల్‌లో ఎంట్రీ ఇస్తాడు. తానే హీరో అనుకొని, ముఖానికి రంగులు పూసుకుంటుంటాడు. ఇంతలోనే నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ మాత్రమేనని చెప్పేసరికి.. పాపం మనోడు డిజప్పాయింట్ అవుతాడు. ఆ నిరాశలోనే కోపంగా వెంకీ కుడుముల ఎక్కడ? అని అడగ్గా.. డైరెక్టర్ ఎంట్రీ ఇస్తాడు. నేను ఆలస్యంగా వచ్చానా? అని వెంకీ అడగ్గా.. అందరూ నిట్టూర్పుగా చాలా ఆలస్యంగా వచ్చావని అంటారు. అయితే.. స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని చెప్పగానే, అందరూ హ్యాపీగా ఫీలై ఏ జోనర్? అని అడుగుతారు.

 

ఛలో, భీష్మ స్థాయిలో ఉంటుందా? అని ప్రశ్నిస్తే.. కాదు ‘ఇది వేరే లెవెల్’ అని వెంకీ చెప్తాడు. అప్పుడే.. ఒక చిన్న గ్లిమ్స్ చూపించారు. అందులో ఒకరు బైక్ మీద వచ్చి, స్టైల్‌గా దిగి, ఒక బిల్డింగ్ ఎక్కుతున్నట్టు చూపిస్తారు. కానీ.. ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. టైటిల్ ఏంటని అడగ్గా.. అన్నీ ఇప్పుడే చెప్తేస్తారా? ఒక్కొక్క డీటెయిల్ రివీల్ చేస్తానని వెంకీ చెప్పడంతో వీడియో ముగుస్తుంది. చూస్తుంటే.. ఈ సారి #VNRTrio డిఫరెంట్ కాన్సెప్ట్‌తో సరికొత్త ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.