National

మ్యాచ్‌కు ముందు పట్టుబడిన ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు.. భారీ కుట్రకు పన్నాగం

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో నేడు భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు ఇరు దేశాల క్రికెట్ ప్రేమికుల్లో విపరీతమైన ఉత్సాహం కనిపిస్తోంది.

ఇప్పటికే ఆ స్టేడియం పరిసరాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. జనాలంతా పనులు మానుకుని మ్యాచ్ చూసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ ఏజెన్సీ సహకారంతో పంజాబ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను బట్టబయలు చేశారు. జాయింట్ ఆపరేషన్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.

 

వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ ట్వీట్ ద్వారా సమాచారం ఇచ్చారు. ఉగ్రవాదుల నుంచి రెండు ఐఈడీలు, రెండు హ్యాండ్ గ్రెనేడ్లు, రెండు మ్యాగజైన్‌లతో కూడిన పిస్టల్, 24 కాట్రిడ్జ్‌లు, టైమర్ స్విచ్, 8 డిటోనేటర్లు, నాలుగు బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నారు. అమృత్‌సర్, కేంద్ర ఏజెన్సీతో కలిసి ఇంటెలిజెన్స్ ఆపరేషన్‌లో ఎల్‌ఇటి మాడ్యూల్‌ను ఛేదించిందని, జమ్మూ కాశ్మీర్ నివాసితులైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు డిజిపి చెప్పారు. ఉగ్రవాద మాడ్యూల్‌ను లష్కరే తోయిబా క్రియాశీల సభ్యుడు ఫిర్దౌస్ అహ్మద్ భట్ నిర్వహిస్తున్నాడు.