TELANGANA

రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు 100 కోట్ల పరువునష్టం దావా వేసిన కేటీఆర్..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌లకు మంత్రి కేటీఆర్ ఊహించని షాక్ ఇచ్చారు. టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నందుకు గాను.. ఆ ఇద్దరికీ పరువునష్టం దావా నోటీసులు ఇచ్చారు. రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును అనవసరంగా లాగుతున్నారని.. తన న్యాయవాది ద్వారా ఆ ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 నిబంధనల ప్రకారం పరువునష్టం దావా నోటీసులు పంపారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న తన పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన.. ఎదుటి వారిపై అసత్య ప్రేలాపనాలు చేసే హక్కు వారికి లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలను మానుకోవాలని సూచించారు. ఇప్పటివరకూ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని.. తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆ నోటీసులో కేటీఆర్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా తమ వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణలు చెప్పకపోతే.. రూ.100 కోట్ల పరువునష్టం దావాను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా.. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన నిరాధార ఆరోపణలను సాక్షాలతో సహా తన నోటీసులో ప్రస్తావించారు.

 

కాగా.. టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారం వెలుగుచూసినప్పటి నుంచి, ఈ వ్యవహారంలో మంత్రి కేటీఆర్ కార్యాలయానికి సంబంధం ఉందని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే! తనకు సంబంధం లేదని ఈ కేసు నుంచి తెలివిగా తప్పించుకునేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యలు కూడా చేశారు. పేపర్ లీకేజీకి మంత్రి కేటీఆర్‌దే బాధ్యత అని, ఆయన్ను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదొక పెద్ద కుంభకోణం అని, ఇందులో పాలకులతో పాటు ప్రభుత్వాధికారుల హస్తం కూడా ఉందని, వారిని కాపాడ్డం కోసమే సిట్‌ని రంగంలోకి దింపారంటూ వ్యాఖ్యానాలు చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటీఆర్.. రాజకీయ దురుద్దేశంతో తనపై ఆరోపణలు చేస్తున్నారంటూ రేవంత్, బండి సంజయ్‌లకు నోటీసులు ఇచ్చారు. క్షమాపణలు చెప్పాలని వారం రోజుల గడువు ఇచ్చారు. మరి, దీనిపై ఆ ఇద్దరు ఎలా స్పందిస్తారో చూడాలి.