TELANGANA

నో అసెంబ్లీ.. ఓన్లీ పార్లమెంట్.. కేసీఆర్ స్కెచ్ వెనుక కారణమిదీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్‌ విజయం సాధించి మూడో సారి ముఖ్యమంత్రి కావాలని ఆశపడ్డారు బీఆర్‌ఎస్‌ బాస్‌ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు. కానీ, గెలుపు ముంగిట బొక్కబోర్లా పడ్డారు. విజయానికి 21 సీట్ల దూరంలో ఆగిపోయారు. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారు. పరాభవం నుంచి ఇంకా గులాబీ బాస్‌ కోలుకోలేదు. ఈ క్రమంలో ఏర్పడిన కోపం, తాపం, ఫ్రస్ట్రేషన్‌ కారణంగా ఇటీవల ఆయన బాత్‌రూంలో జారిపడ్డారు. తుంటి ఎముక డ్యామేజ్‌ కావడంతో శస్త్ర చికిత్స చేసుకుని బెడ్‌ రెస్ట్‌ తీసుకుంటున్నారు. చింత చచ్చినా.. పులుపు చావదు అన్నట్లు.. పరాభవం ఎదురైనా బీఆర్‌ఎస్‌ బాస్‌తోపాటు ఆయన కొడుకు, అల్లుడిలో మాత్రం అహంకారం తగ్గలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓటమిని జీర్ణించుకోలేక.. అసహనం.. ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలో లోక్‌సభ ఎన్నికలు రానే వస్తున్నాయి.

 

More

From Telangana politics

మెదక్‌ బరిలో గులాబీ బాస్‌..

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మెదక్‌ స్థానం నుంచి పోటీ చేయాలని బెడ్‌పై నుంచే గులాబీ బాస్‌ ఆలోచన చేస్తున్నారు. విశ్రాంతిలో ఉన్న ఆయన ఈమేరకు కొడుకు కేటీఆర్, అల్లుడు హరీశ్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఎవరిని బరిలో నిలపాలి, విజయానికి ఎలా ముందుకు సాగాలి, ఓటమి నుంచి ఎలా తప్పించుకోవాలని అని సూచనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన గజ్వేల్‌కు రాజీనామా చేసి.. మెదక్‌ నుంచి పోటీ చేసి లోక్‌సభలో అడుగు పెట్టాలని భావిస్తున్నారు.

 

రంగంలోకి ట్రబుల్‌ షూటర్‌..

అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనపై పోటీ చేసిన ఈటల రాజేందర్‌ సీఎంగా ఉన్న కేసీఆర్‌పై గజ్వేల్‌ నుంచి పోటీ చేశారు. కానీ, విజయం సాదించకపోయినా ఒక దశలో కేసీఆర్‌ వెన్నులు వణుకు పుట్టించారు. కామారెడ్డిలో మాత్రం కేసీఆర్‌ ఓటమి నుంచి తప్పించుకోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేసీఆర్‌ను గెలిపించేందకు అల్లుడు హరీశ్‌ రంగంలోకి దిగారు. ఇప్పటి నుంచే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తున్నారు. మామ బెడ్‌పై ఉన్నందున.. ఆయన తరఫున క్షేత్రస్థాయిలో క్యాడర్‌ను కార్యోన్ముఖులను చేస్తున్నారు. ప్రజలు పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేశారని, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మనమే ఎక్కువ సీట్లు సాధిస్తామని కేడర్‌లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. తద్వారా బరిలో కేసీఆర్‌ ఉండబోతున్నారన్న సంకేతాలను పార్టీ శ్రేణులకు ఇస్తున్నారు.