TELANGANA

రేషన్ కార్డులపై రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్..

తెలంగాణలో రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఈ నెలాఖరు నాటికి ఈ-కేవైసీ గడువు ముగియబోతోన్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. గడువును మరో నెల రోజుల పాటు పొడిగించింది.

 

ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యవేక్షణలో ఉన్న పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ.. రాష్ట్రవ్యాప్తంగా బోగస్‌ కార్డుల ఏరివేత చేపట్టిన విషయం తెలిసిందే. దీనికోసం లబ్దిదారులు తమ రేషన్‌ కార్డులను అప్‌డేట్ చేసుకోవడానికి ఈ-కేవైసీ విధానాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. ఈ నెల 31వ తేదీ నాటికి ఈ- కేవైసీని పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని ఆదేశించింది.

 

గడువు సమీపించిన నేపథ్యంలో లబ్దిదారులు ఆన్‌లైన్ ద్వారా ఈ-కేవైసీ అప్‌డేట్ కోసం ఎగబడుతున్నారు. ఆన్‌లైన్ కేంద్రాలతో చౌక ధరల డిపోల వద్ద బారులు తీరుతున్నారు. ఫలితంగా సర్వర్లు స్తంభించిపోయే పరిస్థితి నెలకొంది. పలు చోట్ల అప్‌డేట్ కావట్లేదనే ఫిర్యాదులూ అధికార యంత్రాంగానికి అందుతున్నాయి.

 

 

రేషన్ కార్డుదారులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ కావడం, మరణించిన కుటుంబ సభ్యుల పేర్లు ఇంకా కార్డుల్లో ఉండటం.. ఇతరత్రా కారణాల వల్ల చౌక ధరల దుకాణాల నుంచి అందుతున్న నిత్యావసర సరుకులు దారి మళ్లుతున్నాయని, బ్లాక్ మార్కెట్‌కు తరలుతున్నాయనే ఉద్దేశంతో పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ అధికారులు ఈ-కేవైసీ అప్‌డేట్ చేసుకోవాలని ఆదేశించారు.

 

దీనికి అడ్డుకట్ట వేయడానికి ఈ-కేవైసీ ప్రక్రియ చేపట్టారు. ఇందులో భాగంగా కార్డుదారుల నుంచి వేలిముద్రలను సేకరిస్తున్నారు. వారి వివరాలన్నింటినీ అప్‌డేట్ చేస్తూ వస్తోన్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్నవారు కూడా తమ సమీప చౌక డిపోల్లో కేవైసీ పూర్తి చేసుకునే వెసలుబాటు కల్పించారు. ఈ నెల 31వ తేదీ నాటికి ఈ-కేవైసీ గడువు ముగియాల్సి ఉంది.

 

చాలా చోట్ల సర్వర్లు స్తంభించిపోయే పరిస్థితి నెలకొనటం, లబ్దిదారలు పెద్ద సంఖ్యలో ఈ కేవైసీ కోసం ఎగబడుతుండటం వంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ గడువును పొడిగించింది. ఫిబ్రవరి చివరి వరకూ గడువు పొడిగించినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఒకట్రెండు రోజుల్లో వెలువడొచ్చు.