AP

తిరుమల శ్రీవారి నడక మార్గం భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

తిరుమల శ్రీవారి నడక మార్గం భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. నడక మార్గంలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు త్వరలో జారీ చేస్తామని ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు.

ఇందుకు సంబంధించి భక్తులు అభిప్రాయాలను సేకరించి నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. భక్తులతో నేరుగా తిరుమలకు సంబంధించిన అంశాలపైన ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు. ఆ సమయంలో భక్తులు దివ్య దర్శనం గురించి ప్రస్తావించారు. దీని పైన అన్ని రకాలుగా చర్చించి అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అదే విధంగా ఆలయంలో తోపులాట పైనా ఫిర్యాదులు రావటంతో..భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని ధర్మారెడ్డి స్పష్టం చేసారు.

టీటీడీ సంభందించిన ఆస్తులపై పూర్తి స్థాయి సమాచారంతో రిజిస్ట్రేషన్ శాఖకు దరఖాస్తు చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీటీడీ బడ్జెట్ వివరాలు ప్రకటిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. దివ్య దర్శనం గురించి భక్తుల నుంచి పదేపదే అభ్యర్ధులు వస్తుండటంతో దీని పైన స్పష్టత ఇచ్చారు. మెట్ల మార్గంతో వచ్చు భక్తులు అప్పటికే దర్శనం టికెట్లు తీసుకున్నారో లేదీ పరిశీలిస్తామని, వారికి దర్శనం – సేవా టికెట్లు లేకపోతే దివ్య దర్శనం టికెట్లు అందిస్తామని స్పష్టత ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తర్వాత టీటీడీ బడ్జెట్ వివరాలు ప్రకటిస్తామన్నారు. శ్రీవాణి భక్తులకు తిరుమలలోని ఏటీజీహెచ్, ఎస్ఎన్జీహెచ్ అతిధి గృహల్లోని 88 గదులను కేటాయిస్తామని… కాషన్ డిపాజిట్ విధానంపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఏప్రిల్ నుండి తిరుమలలో ఎలక్ట్రికల్ ఉచిత బస్సులను అందుబాటులోకి తెస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలలో అమలు చేస్తున్న ”ఫేస్ రికగ్నిషన్” విధానం సత్ఫలితాలు ఇస్తోందని ధర్మారెడ్డి వివరించారు. నూతన విధానం ద్వారా భక్తులకు ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న యాప్ లో మరింత సౌకర్యవంతమైన ఫీచర్స్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రిఫండ్‌ చెల్లింపునకు ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఈ యాప్ ద్వారా దర్శనం, లడ్డూల పంపిణీలో అవకతవకలు జరిగే అవకాశం ఉండదని చెబుతున్నారు.