TELANGANA

నెలన్నర రోజుల్లోనే ఆర్టీసీ బస్సుల్లో 12 కోట్ల మంది మహిళల ప్రయాణం..

తెలంగాణలో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ప్రతి రోజు లక్షలాది మంది మహిళలు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మహిళలకు ఉచిత ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమని తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వ్యాఖ్యానించారు.

 

45 రోజుల్లో 12 కోట్లకుపైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారని సజ్జనార్ తెలిపారు. సగటున ప్రతి రోజు 27 లక్షల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేస్తున్నారని వెల్లడించారు. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించారు.

 

ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ఉచిత ప్రయాణం కారణంగా వికలాంగులకు కేటాయించిన సీట్లలో కూడా మహిళలు కూర్చుంటున్నారని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయని తెలిపారు. త్వరలో 2375 కొత్త బస్సులు తీసుకుంటున్నామన్నారు. అప్పుడు కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు.

 

అవసరమైతే వికలాంగుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసే విధంగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని వీసీ సజ్జనార్ తెలిపారు. అనౌన్స్‌మెంట్, ఎంక్వయిరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశం కల్పిస్తామని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ హామీ ఇచ్చారు.