AP

ఏపీలో వార్డు సచివాలయానికో హెల్త్ క్యాంప్- 14 వేల శిబిరాలు-జగనన్న ఆరోగ్య సురక్షతో..

ఏపీలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి వార్డు సచివాలయం పరిధిలో ఓ వైద్య శిబిరాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇవాళ్టి నుంచి అన్ని వార్డు సచివాలయాల పరిధిలో వైద్యశిబిరాలు ప్రారంభమయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం బాకన్నపాలెం లో నిర్వహించిన వైద్య శిబిరానికి మంత్రి హాజరయ్యారు.

రాష్ట్ర వ్యాప్తంగా 10,574 వైద్య శిబిరాలను జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద నిర్వహించాలని తొలుత భావించామని, అయితే ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందన నేపథ్యంలో సీఎం ఆదేశాల మేరకు వాటిని 14వేలకు పెంచామని మంత్రి రజని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో ప్రైమరీ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలో ఒకటి కాకుండా, ప్రతి వార్డు సచివాలయ పరిధిలో ఒక వైద్య శిబిరాన్ని నిర్వహించేలా జగనన్న ఆదేశించారని చెప్పారు. ఈ మేరకు 14 వేలకు పెంచామని, రాష్ట్రం మొత్తం మీద 15వేలకు వైద్య శిబిరాలు అవసరం అవుతాయన్నారు.

ఈ నెల 13 వ తేదీలోపు ఈ కార్యక్రమం ద్వారా ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా 23.78లక్షల ఓపీ సేవలు నమోదయ్యాయని మంత్రి రజని వెల్లడించారు. తొలి 14 రోజుల్లో ఏకంగా 6334 వైద్య శిబిరాలు నిర్వహించామని వెల్లడించారు. వీరిలో 52,666 మందికి మెరుగైన వైద్యం అవసరమని గుర్తించామని, వీరిని పెద్ద ఆస్పత్రుల్లో చేర్పించి ఉచితంగా వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. వీరు ఆరోగ్యం మెరుగయ్యి ఆనందంగా ఉన్నప్పుడే వీరి కేసును ఆన్‌లైన్ లో సిబ్బంది తొలిగిస్తారని వెల్లడించారు.

 

అలాగే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వైద్య శిబిరాల్లో స్పెషలిస్టు వైద్యులు పాల్గొని సేవలు అందిస్తున్నారని మంత్రి రజని తెలిపారు. వచ్చిన రోగులకు ఉచితంగా కన్సల్టేషన్‌తోపాటు మందులు, టెస్టులు అందిస్తున్నామని చెప్పారు. ఉచితంగా బీపీ, షుగర్‌, హిమోగ్లోబిన్ టెస్టులతోపాటు, రోగి అంగీకారం మేరకు మరో మూడు టెస్టులు చేస్తున్నామన్నారు. మొత్తం 7 రకాల టెస్టులు అందిస్తున్నామని చెప్పారు. 100 రకాలకు పైగా ముందులను అన్ని క్యాంపుల్లో అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు.